సామాన్యుడికి పెట్రోల్ సెగ?: ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చు?
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల పెరుగుదల వంటింటిని కూడా తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడ పెరగవచ్చునని తెలుస్తోంది. ప్రత్యేకించి కూరగాయలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, డిటర్జంట్స్, వంట నూనెల్లాంటి వస్తువుల ధరలు దాదాపు 4 నుంచి 7 శాతం మేరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Recommended Video
ఒకవేళ నిత్యావసర వస్తువుల ధరలు గనుక పెరిగితే డిమాండ్-సప్లై మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతుందని, అది ద్రవ్యోల్భణానికి దారి తీస్తుందని అంటున్నారు. ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల గిరాకీ తగ్గుతుందని అంటున్నారు. కాగా, దేశంలో గతేడాది జూలై నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని అమలులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తొలుత పలు నిత్యావసర వస్తువులను 28 శాతం పన్నురేటు శ్లాబులో చేర్చిన సంగతి తెలిసిందే.
అయితే గతేడాది నవంబర్ లో కొన్ని వస్తువులపై శ్లాబు రేట్లను సవరించింది ప్రభుత్వం. 178 రకాల వస్తువులను 18 శాతం పన్ను శ్లాబులోకి మార్చింది. దీంతో ఆయా వస్తువులపై 10 నుంచి 20శాతం మేర ధరలు తగ్గాయి. అయితే తాజాగా పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. పెరిగిన పెట్రోల్ ధరలతో రవాణా ఖర్చుల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడనుంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు పెరిగిన పెట్రోల్ ధరలకే బెంబేలెత్తుతున్న జనానికి ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారం కానున్నాయి.