పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావొద్దు: కేంద్రానికి ఈటెల హెచ్చరిక
హైదరాబాద్: పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి (వస్తు సేవల పన్ను - గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) తీసుకు రావొద్దని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.
ఇప్పటికే 52 శాతం వ్యాట్ జీఎస్టీ పరిధిలోకి వెళ్లిందన్నారు. కేవలం 48 శాతం వ్యాట్ మాత్రమే పెట్రోల్, డీజిల్, మద్యం తదితర వాటి ద్వారా రాష్ట్రానికి వస్తోందని చెప్పారు. అసలు పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం మంచిది కాదన్నారు.
ప్రజలపై భారం పడుతుందనుకుంటే కేంద్రం విధిస్తోన్న పన్నులను తగ్గించాలని సూచించారు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని తగ్గించి, కేంద్రం తమ గుప్పిట్లో రాష్ట్రాలను ఉంచుకోవాలన్న భావన సరికాదని అభిప్రాయపడ్డారు.
తద్వారా రాష్ట్రాల హక్కులను హరించే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇప్పుడిస్తున్న 42 శాతం పన్నుల వాటాను మరింత పెంచాలని, రాష్ట్రాలు అప్పులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఈటెల డిమాండ్ చేశారు.