మహబూబ్నగర్లో అమానవీయ ఘటన... కరోనా రోగికి నేలపై మందులు విసిరిన ఫార్మాసిస్ట్...
కరోనా రోగుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోగికి మానసిక ధైర్యం చెప్పాల్సిన వైద్య సిబ్బందే కొన్నిచోట్ల వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం కేంద్రంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే... మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతీ రోజు పదుల సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ కరోనా టెస్టులు చేయించుకుని పాజిటివ్గా తేలినవారి పట్ల బాలు అనే మెడికల్ ఫార్మాసిస్ట్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నాడు. మందుల కోసం వారిని కౌంటర్ దాకా రాకుండా అడ్డుకుంటున్నాడు. అతనే బయటకు వచ్చి వారికి కావాల్సిన మందులను దూరం నుంచి నేలపై విసిరేస్తున్నాడు.
నిస్సహాయ స్థితిలో అలా కింద పడేసిన మందులను తీసుకుని పేషెంట్లు ఇంటికి వెళ్తున్నారు. ఫార్మాసిస్ట్ బాలు ఇలా కరోనా రోగుల పట్ల అమానవీయంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని రోగులు,స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కోవిడ్ రోగుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చినప్పటికీ ఫార్మాసిస్ట్ దాన్ని పట్టించుకోకుండా ఇలా వారిని అవమానించేలా వ్యవహరించడంపై రోగుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారికి మానసిక ధైర్యం చెప్పి... తగు జాగ్రత్తలు సూచించాల్సింది పోయి ఇంత దారుణంగా వ్యవహరించడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వస్తే.. లాక్డౌన్ మొదటిరోజైన బుధవారం(మే 12) రాష్ట్రంలో కొత్తగా 4723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 745 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 5,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మరో 31 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711కి చేరింది.ఇప్పటివరకూ 2,834 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ 4,49,744 మంది కరోనా నుంచి కోలుకోగా... ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video
ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా వేళ తెలంగాణతో పాటు నాలుగైదు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ కల్ప తరువులా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని... రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయని స్వయంగా కేంద్రమంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు.