కెసిఆర్, బాబుల క్రీడ, అందులో ఉద్యోగులెందుకు: పొన్నం
హైదరాబాద్: సెక్షన్-8 తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ క్రీడ అని, ఇందులో ఉద్యోగుల ప్రమేయం ఎందుకు అని తెలగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రకభార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ జాప్యం చేస్తే ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు నిలదీయలేదన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ పదవి కోసం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్టీవో నేతలు పదవుల కోసం ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ద్వజమెత్తారు.
తెలంగాణ ఎన్జీవో నేతలు టిఆర్ఎస్కు తొత్తులుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలు పట్టించుకోకపోతే దేవీ ప్రసాద్, శ్రీనివాస గౌడ్లను ఉద్యోగ సంఘాల పదవుల నుంచి తప్పించే పరిస్థితులు వస్తాయని ఆయన హెచ్చరించారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగడం చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా వద్ద ఆ వ్యాఖ్యలు చేశారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారన్నారు. తలసానిని వెంటనే బర్తరఫ్ చేయాలని మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు.