అలా పక్కకు!: ఫోన్ ట్యాపింగ్లో ఐఏఎస్ ఆఫీసర్ని వాడుకొని వదిలేశారా?
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న తెలంగాణ ఐఏఎస్ అధికారి వెంకటేశం అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తనను వాడుకొని వదిలేసిందని అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోందని పేర్కొంటున్నారు.
తెలంగాణ స్థానికత ఉన్న తనకు ప్రత్యేక రాష్ట్రంలో కీలక పదవే దక్కుతుందని ఆశించారని, సీఎంవోలో చోటు దక్కుతుందని భావించారట. ఆయనను హోంసెక్రటరీగా నియమించినప్పటికీ మూణ్ణాళ్ల ముచ్చటే అంటున్నారు.
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేసిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్తో సంబంధం ఉన్న అధికారులను పక్కకు తప్పిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ట్యాపింగ్ కోసం హోంశాఖ సెక్రటరీ అనుమతి కావాలి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యవహారంలో చిక్కుకుపోయారని, అందుకే ఆయనను తప్పించారని ప్రచారం జరుగుతోందని వార్తలొస్తున్నాయి.
సెలవులో ఉన్న వెంకటేశంకు మాటమాత్రం చెప్పకుండా తప్పించారని తెలుస్తోంది. తనను ప్రభుత్వం వాడుకొని వదిలేసిందనే ఆవేదనలో ఆయన ఉన్నారంటున్నారు. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే, ఆయన నిజంగానే అసంతృప్తితో ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.