ఫోన్ ట్యాపింగ్పై ఏం చేద్దాం?: సిఎస్ రాజీవ్ శర్మతో త్రివేది మంతనాలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రాజీవ్ శర్మను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది శుక్రవారం నాడు మధ్యాహ్నం కలిశారు. తనకు ఏపీ సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు సంస్థ) జారీ చేసిన నోటీసుల అంశం చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఏపీ మఖ్యమంత్రి, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దస్త్రాలు, కాల్ డేటా, సమాచారన్ని భద్రపరచాలని విజయవాడ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రతులను ఏపి సిట్ అధికారులు తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి గురువారం అందజేసిన విషయం తెలిసిందే.
అనంతరం రాజీవ్ త్రివేది మాట్లాడుతూ... కాల్ డాటా ఆధారాలను సమయం వచ్చినప్పుడు కోర్టుముందు ఉంచుతామని రాజీవ్ త్రివేది చెప్పారు.
ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావుతోపాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదులపై విజయవాడలో కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులపై విచారణకు ఏర్పాటైన సిట్ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ కాల్డేటాకు సంబంధించిన ఆధారాలను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరింది. ఈ మేరకు విజయవాడ కోర్టు కాల్ డాటాను, ఆధారాలను భద్రపర్చాలని తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన నోటీసుల కాపీని సిట్ అధికారులు గురువారం సచివాలయంలో త్రివేదీకి ఆయన కార్యాలయంలో అందించారు. నోటీసుల్లో ఉన్నట్టుగానే అన్ని ఆధారాలను భద్రపరుస్తామని రాజీవ్ త్రివేది అనంతరం మీడియాకు తెలిపారు. తమకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెప్పారు.