ఫోన్ ట్యాపింగ్ చిక్కులు: సర్వీస్ ప్రొవైడర్లు కెసిఆర్ను బుక్ చేశారా?
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడ్డంగా బుక్కయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పీతల సుజాత సోమవారం నాడు అన్నారు.
ఓటుకు నోటు పేరిట తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన కేసిఆర్, తాను ఉచ్చులో చిక్కుకొని అడ్డంగా బుక్కయ్యారన్నారు. తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పిన కెసిఆర్ మాటలు సుప్రీం కోర్టులో సర్వీస్ ప్రొవైడర్ల వాదనతో వీగిపోయాయని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ అడ్డంగా బుక్కయ్యారా? అంటే అవునని తెలుగుదేశం పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఆదివారం నాడు జూపూడి ప్రభాకర రావు కూడా ఇలాగే చెప్పారు.
ఓటుకు నోటు కేసులో ఏ ముఖ్యమంత్రి కూడా పదవిని కోల్పోలేదని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ఆదివారం అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏ సీఎం ఇప్పటి వరకు పదవిని పోగొట్టుకోలేదన్నారు. కానీ కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారి పైన చట్టం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయామని సర్వీస్ ప్రొవైడర్లు ఇటీవల సుప్రీం కోర్టుకు విన్నవించారు. కాల్ డేటా వివరాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని కానీ ఇవ్వవద్దని చెబుతున్నారని చెప్పారు.