సీరియల్ విచారణ: ఎసిబికి ఏమీ తెలియదన్న ప్రదీప్ (ఫొటోలు)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) విషయాలను రాబట్టేందుకు వరుసగా విచారణలు సాగిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు వి.పుల్లారావు యాదవ్, టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్లతోపాటు ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రరెడ్డిలను సోమవారం అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
ఐదుగురు కూడా ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా, ప్రత్యేక బృందాల అధికారులు వీరిని ప్రశ్నించారు. సాయంత్రం 5:30 గంటల వరకు సాగిన ఈ విచారణలో కీలక సమాచారాన్ని వీరినుంచి రాబట్టినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారం నడిచినప్పుడు ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారితో ఎక్కువసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దానిపై ఆరాతీశారు. వీరందర్నీ సాయంత్రవరకు ఉంచినా ఒక్కొక్కర్ని కొద్ది సమయం మాత్రమే ప్రశ్నించినట్లు తెలిసింది. వ్యక్తిగత, కేసుతో సంబంధం ఉన్న ప్రశ్నలకు జవాబులు రాబట్టిన అధికారులు మంగళవారం మళ్లీ హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.
ఐదుగురిని ప్రశ్నించారు...
ఓటుకు నోటు కేసులో ఎసిబి అధికారులు సోమవారం ఐదుగురిని ప్రశ్నించారు. వారి నుంచి విషయాలు రాబట్టాడనికి ప్రయత్నించారు.
ఉదయసింహ, సెబాస్టియన్
ఓటుకు నోటు కేసులో ఐదుగురిని ప్రశ్నించే సమయంలో కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్లను కూడా ఎసిబి అధికారులు రప్పించినట్లు తెలుస్తోంది.
ఎసిబి కార్యాలయంలో విచారణ
నోటుకు ఓటు కేసులో వివరాలను అందించగలరని అనుమానం ఉన్న ఐదుగురిని ఎసిబి అధికారులు సోమవారంనాడు ప్రశ్నించారు.
ఏమీ తెలియదన్న ప్రదీప్
తనకున్న పరిచయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారని టీడీపీ నాయకుడు ప్రదీప్ చౌదరి చెప్పారు. కేసుతో సంబంధం ఉందా? అని ప్రశ్నించగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశానన్నారు. అసలు ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం ఏమిటో ఏసీబీకే తెలియడం లేదని మీడియాతో అన్నారు. ప్రదీప్ చౌదరి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు.
ప్రమేయం లేదన్న పుల్లారావు
ఎసిబి అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాధానం చెప్పానని విద్యార్థి నాయకుడు పుల్లారావు యాదవ్ చెప్పారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని, కాల్ డేటా ఆధారంగా సేకరించిన ఫోన్ నంబర్ల ప్రకారం తనతో టచ్లో ఉన్నవారి నంబర్లు ఎవరివని ప్రశ్నించినట్లు చెప్పారు. ‘‘హాస్టల్లో ఉండేవారికి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఇవ్వరని, అందుకే బల్కంపేట్కు చెందిన ఫ్రెండ్ కరుణాకర్ ఇంటి చిరునామాతో కనెక్షన్ తీసుకున్నాను'' అని ఓ ప్రశ్నకు జవాబిచ్చానన్నారు.
రాఘవేందర్ రెడ్డి కీలకమా..
నోటుకు ఓటు కేసులో నిందితుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి ఎసిబి అధికారులు సోమవారం కూడా ప్రశ్నించారు. అంతకు ముందు కూడా ఆయనను ఎసిబి అధికారులు ప్రశ్నించారు.