యుపిలో బంగారం దొరక్క హైదరాబాద్పై పడిన ఇరానీ గ్యాంగ్ (పిక్చర్స్)
హైదరాబాద్: కరుడుగట్టిన ఇరానీ చైన్స్నాచింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏడాదిగా సైబరాబాద్, హైదరాబాద్లలో ఈ గ్యాంగ్ 32 చైన్స్నాచింగ్లకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఈ గ్యాంగ్లోని ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ గ్యాంగ్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహారాష్ర్ట కటోల్ ప్రాంతానికి చెందిన ఫతే అక్రమ్ అలీ(23), హైదర్ అక్రమ్ అలీ(20)లు సోదరులు. వీరు వృత్తి రీత్యా సన్ గ్లాసెస్ను విక్రయించే సేల్స్మెన్గా పని చేస్తున్నారు.
ఈ ఇద్దరు ఆర్టిఫీషియల్ డైమండ్స్ వ్యాపారం చేసే జావీద్ అలీ, ఖలందర్, బోల్అఫ్సర్లతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తమ విలాసవంతమైన జల్సాల కోసం ఈ గ్యాంగ్ చైన్స్నాచింగ్లకు శ్రీకారం చుట్టింది. మొదట్లో ఈ గ్యాంగ్ ఉత్తర్ప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో స్నాచింగ్లు చేశారు. అక్కడ బంగారం ఎక్కువగా దొరకకపోవడంతో, వారు హైదరాబాద్పై దృష్టిపెట్టారు. హైదరాబాదులో నాణ్యమైన బంగారం దొరుకుతుందని, ఇక్కడ మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరిస్తారని గుర్తించిన ఇరానీ గ్యాంగ్ హైదరాబాద్పై పడింది.
రైల్వే స్టేషన్లే అడ్డాగా..
కటోల్, హోసన్ఘడ్ నుంచి వచ్చే ఇరానీ గ్యాంగ్ నగరంలోని రైల్వే స్టేషన్లను వారి అడ్డ్డాగా చేసుకున్నాయి. ముందుగా రైలులో వీరు రెండు వాహనాలను తెచ్చుకుని వాటిని పార్కింగ్లో ఉంచుతారు. రెండు రోజుల పాటు స్నాచింగ్ స్పాట్లను రెక్కీ చేసుకుంటారు. ఆ తర్వాత పార్కింగ్ నుంచి బైక్లను తీసుకుని స్నాచింగ్లకు బయలుదేరుతారు.
కనీసం ఆరు స్నాచింగ్లు
ఒకసారి బయటికి వెళ్తే ఇరానీ గ్యాంగ్ కనీసం 6 స్నాచింగ్లు చేయనిదే వెనక్కి రారు. ఆరు స్నాచింగ్లు పూర్తైన తర్వాత నేరుగా రైల్వేస్టేషన్ పార్కింగ్కు వచ్చి వాహనాలను పార్క్ చేసి అక్కడి నుంచి రైలు ఎక్కి వారి సొంత ప్రాంతానికి వెళ్ళిపోతారు. అలా ఈ గ్యాంగ్ గత 12 నెలలుగా మూడు విడతలుగా వచ్చి 36 స్నాచింగ్లకు పాల్పడింది.
సొంత ప్రాంతాల్లోనే..
ఇరానీ గ్యాంగ్ చోరీ సోత్తును నగరంలో నగరంలో విక్రయించకుండా, వారి సొంత ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడే విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులకు క్లూ దొరకకుండా చేశారు. రికవరీ కోసం వెళ్ళినప్పుడు రిసీవర్లు పోలీసులకు సహకరించకుండా ఎదురు తిరుగుతూ బాధితుల సొత్తును దక్కకుండా నానా యాగీ చేస్తున్నారు. దీంతో పోలీసులు అష్టకష్టాలు పడి మొత్తం 32 కేసులలో కేజీ బంగారాన్ని రికవరీ చేశారు.
రెండు బైక్లు స్వాధీనం
స్నాచింగ్లకు ఉపయోగించిన రెండు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ బైక్లను నగరానికి తీసుకువచ్చి ఇక్కడి నెంబరు ప్లేట్లను మార్చుకుని స్నాచింగ్లకు పాల్పడ్డారని పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ గ్యాంగ్లో ముగ్గురు అరెస్టు కాగా, ఖలందర్, బోలు అఫ్సర్లు పరారీలో ఉన్నారు.
ఇరానీ గ్యాంగ్ అంటే...
16 వ శతాబ్ధంలో ఇరాన్ నుంచి కొంతమంది వచ్చి దేశంలో స్థిరపడ్డారు. ఇలా వలస వచ్చిన వీరిలో కొందరు స్నాచింగ్లతో పాటు నకిలీ పోలీసులుగా, దృష్టి మరల్చి దోచుకోవడం, ఏటీఎమ్ చీటింగ్ తదితర నేరాలకు పాల్పడుతూ సామాన్యులను దోచేస్తున్నారు.
గ్యాంగ్ స్థావరాలు..
ఇరానీ గ్యాంగ్ బీదర్, గుల్బర్గా, పార్లీ (కర్నాటక) బసవల్లీ, కటోల్, అంబోలీ, లోనీ, ఘాటక్పార్, బీవండీ,కళ్యాణీ, పూణే (మహారాష్ట), హోసన్ఘడ్, పీపరియా, భోపాల్ (మధ్యప్రదేశ్)లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతుంది.
అభినందనలు
ఇరానీ గ్యాంగ్ క్లూను సంపాదించి, నిందితులను పట్టుకున్న ఎల్బీనగర్ జోన్ క్రైం టీమ్ మురళీకృష్ణ, ఎల్బీనగర్ డీఐ సునీల్, సరూర్నగర్ డీఐ లక్ష్మణ్, అవినాష్బాబు ఇతర సిబ్బందిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రత్యేకమైన రివార్డులను అందించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, క్రైం డీసీపీ నవీన్కుమార్, క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి రాంచంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్రావులు పాల్గొన్నారు.
పెరిగిన లోకల్ గ్యాంగ్స్ బెడద
స్నాచింగ్లలో లోకల్ గ్యాంగ్స్ బెడద కూడా పెరిగిందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. కొంతమంది యువకులు ఈజీ మనీ కోసం ఈ నేరాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇటీవల పోలీసుల నిఘాలో ఇద్దరు యువకులు దొరికారన్నారు.