చిన్నారికి గోడ కుర్చీ: రక్తం గడ్డ కట్టి మృతి, తల్లి శోకం (పిక్చర్స్)
కరీంనగర్: టీచర్ విధించిన గోడ కుర్చీ శిక్షతో ఓ చిన్నారి బలైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆ కూతురు తల్లి శోక సముద్రంలో మునిగిపోయింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కర్కశంగా వ్యవహరించి కఠినంగా శిక్షించడంతో తొమ్మిదేండ్ల చిన్నారి కన్నుమూసింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన కొలిపాక సమ్మయ్య, రమ దంపతులు కూలిపనులు చేస్తున్నారు. పట్టణంలోని వివేకవర్ధిని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వీరి కూతురు ఆశ్రిత(9) ఐదోతరగతి చదువుతున్నది. ఈనెల 16న హోంవర్క్ సరిగా చేయలేదని లెక్కల టీచర్ రెండు గంటలపాటు ఆశ్రితను గోడ కుర్చీ వేయించింది.
ఇంటికెళ్లిన తర్వాత చిన్నారి అస్వస్థతకు గురవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. డబ్బులిస్తాననడంతో ప్రైవేట్ దవాఖానలో న్యూరోసర్జన్ వద్దకు తీసుకెళ్లగా మోకాళ్ల కింద రక్తం గడ్డకట్టి నరాలపై ప్రభావం చూపుతున్నదని వివరించారు. రెండు రోజుల చికిత్స చేసినా నయంకాలేదు. జ్వరంతోపాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు.
చికిత్స పొందుతూ మృతి
వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం బాలిక అశ్రిత కన్నుమూసింది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు మృతదేహా న్ని పాఠశాలకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగిన స్థానికులు..
అశ్రిత మృతికి నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు, పట్టణ ప్రజ లు భారీగా తరలి వచ్చి ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు తరగతి గదుల్లోకి వెళ్లి కుర్చీలు ధ్వంసం చేశారు.
ఫర్నీచర్ ధ్వంసం
పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లు, కుర్చీలు, బెంచీలు, బైకులు, ట్యూబ్లైట్లు, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఏఎస్సై సలీం వచ్చి నచ్చజెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
నచ్చజెప్పినా...
తహసీల్దార్ బీ నాగేశ్వర్రావు, జమ్మికుంట ఎస్సై పాపయ్యనాయక్ వచ్చినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్థానిక రాజకీయ నేతలు వచ్చి ఆశ్రిత తల్లిదండ్రులు, బంధువులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.
పంచనామా చేశారు...
ఆర్డీవో సమక్షంలో పంచనామా నిర్వహించి అంత్యక్రియలు పూర్తిచేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చంద్రశేఖర్ పేర్కొన్నారు.