శ్రీమంతుడి డైలాగ్ ప్రేరణ: రాజేంద్ర ప్రసాద్ ఇలా డ్రైవింగ్ (పిక్చర్స్)
హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపితే మీతోపాటు ఎదుటి వాళ్ల ప్రాణాలకు నష్టం కలుగుతుందని, స్పీడ్ థ్రిల్లింగ్ ఉంటుందని హాలీవుడ్ సినిమాల్లో జాకీచాన్ చేసిన ఫీట్లను మనం చేద్దామనుకుంటే అది అజ్ఞానంతో కూడిన అమాయకమవుతుందని సినీనటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సోమవారం గోషామహల్లోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డవారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులతోపాటు పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమైనవని, ఈ రెండు అంశాలను వాహనదారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని, వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరముందన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడం, ప్రమాదాలు జరగకుండా చూడటం, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో ప్రయోగాలు చేయడం తాను గమనిస్తుంటానని అన్నారు.
గ్రామ దత్తతపై శ్రీమంతుడు చిత్రంలో హీరో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ తనలో స్ఫూర్తిని నింపిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో అత్యంత వెనుకబడి ఉన్న గ్రామాల వివరాలను తెలుసుకోవడానికి సర్వే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
నివారణే ముఖ్యం
ప్రమాదం జరిగిన తర్వాత మేల్కోవడం కంటే, ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. నిబంధనలు పాటిస్తూ వెళ్లే వారికి, నిబంధనలు పాటించకుండా వెళ్లే వారికి గమ్యస్థానానికి చేరుకోవడంలో కేవలం ఐదు నిమిషాల తేడా మాత్రమే ఉంటుందనే విషయాన్ని వివరించారు.
రూల్స్ పాటించాలి
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. దిచక్రవాహనదారులు హెల్మెట్, కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్టు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్లైట్ పడినపుడు ఆగిపోవడం, వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవడం లాంటి నిబంధనలను వాహనదారులు తూచా తప్పకుండా పాటించాలన్నారు.
అంబులెన్స్కు దారి
అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలందించడానికి తీసుకెళ్లే అంబులెన్స్కు దారికి ఇవ్వాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
తోటి హీరోలకు చెప్తా
నుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవాలనే తోటి హీరోలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా వారిలో కూడా స్ఫూర్తిని నింపుతున్నామని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా పోయేటప్పుడు వెంట తీసుకెళ్లలేం. మనం పోయినా తర్వాత కూడా మంచిపేరు తెచ్చుకునేలా నలుగురికి సహాయపడే పనిచేయడం ఉత్తమమని అన్నారు.
ఈ స్వార్థం ఉండాలి
మంచిపేరు రావాలన్న స్వార్థం అందరిలో ఉండాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు వేముగంటి, తిరుపతి దొరై, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్, ట్రాఫిక్ శిక్షణ సంస్థ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.