డా. శశికుమార్ ఆత్మహత్యలో ట్విస్ట్: ఫామ్హౌస్కు చేర్చిన మిత్రుడి భార్య పరారీ
హైదరాబాద్: డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. డాక్ట్రర్ ఉదయ్ కుమార్పై కాల్పులు జరిపింది తాను కాదని డాక్టర్ శశికుమార్ తన సూసైడ్ నోట్లో రాశాడు. ఉదయ్పై సాయి కాల్పులు జరిపాడని అతను అందులో రాశాడు. తాను భయంతో పారిపోయినట్లు అందులో రాశాడు.
కాగా, శశికుమార్ హిమాయత్ కాల్పుల ఘటన తర్వాత తన మిత్రుడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో మిత్రుడు లేకపోవడంతో అతని భార్య చంద్రకళ శశికుమార్ను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో వదిలిపెట్టినట్లు ఆమె తెలిపింది.
తన చావుకు సాయి, ఉదయ్ కారణమని శశికుమార్ తన సూసైడ్ నోట్లో రాశాడు. మాదాపూర్లోని లారెల్ ఆస్పత్రి గొడవలే ఈ పరిణామాలకు దారి తీసినట్లు భావిస్తున్నారు. శశికుమార్ హైదరాబాదులోని చైతన్యపురిలో ఉంటున్నాడు. శశికుమార్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు రివాల్వర్ను పోలీసులకు సరెండర్ చేసిన శశికుమార్, ఫలితాల వెల్లడి తర్వాత తిరిగి తీసుకున్నాడు. భార్యాపిల్లలు తనను క్షమించాలని శశికుమార్ తన సూసైడ్ నోట్లో కోరాడు. లోరల్ ఆస్పత్రి వివాదంలో తనను కావాలనే ఇరికించారని ఆయన ఆరోపించాడు.
ఆత్మహత్య చేసుకోవడానికి శశికుమార్ వాడిన రివాల్వర్తో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లను కూడా పోలీసులు నక్కలపల్లిలోని ఫామ్హౌస్లో స్వాధీనం చేసుకున్నారు. శశికుమార్, ఉదయ్, సాయి స్నేహితులు. వారంతా కలిసి రూ. 15 కోట్లతో ఆస్పత్రి పెట్టారు. ఒకరు ఆస్పత్రి సిఈవో కాగా, మరొకరు ఎండి, మరొకరు డైరెక్టర్.. కొన్నాళ్ల పాటు బాగానే సాగినా ఇటీవల వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి.
గొడవలు కాస్తా వాటాల దాకా వచ్చాయి. దాంతో చర్చించుకునేందుకు అంతా ఓ హోటల్కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగింది. అందరూ చూస్తుండడంతో అక్కడి నుంచి బయలుదేరారు. కారులో ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇంతలో ఓ డాక్టర్ తన రివాల్వర్ డ్రైవర్ సీటులో ఉన్న మరో డాక్టర్పైకి కాల్పులు డరిపాడు. ఓ బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
మాదాపూర్లో స్థాపించిన లోరల్ ఆస్పత్రికి ఎండిగా ఉదయ్ కుమార్, సిఈవోగా సాయి కుమార్, డైరెక్టర్గా శశికుమార్ ఉన్నారు. శశికుమార్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నా ఉదయ్, సాయి ఆస్పత్రికి ఈ మధ్య ఇతర సర్జన్లను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తున్నారు.
సాయి కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు మొదట భావించినప్పటికీ అతను పారిపోయినట్లు తెలుస్తోంది. శశికుమార్ ను ఫామ్ హౌస్ కు చేర్చిన అతని మిత్రుడి భార్య చంద్రకళ కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం.
శశికుమార్ను ఫామ్ హౌస్కు చేర్చిన చంద్రకళ ఓ ఆర్మీ అధికారి భార్య అని తెలుస్తోంది. సాయికుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాయి కుమార్ దొరికితే తప్ప అసలు విషయాలు తెలిసే అవకాశం లేదని సమాచారం.