ఎసిబికి చిక్కిన లంచావతారం: జేబులో రూ.15 వేలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఓ అవినీతి చేప తెలంగాణ ఎసిబి వలలో పడింది. హైదరాబాదులోని సరూర్నగర్ మండల సర్వేయర్ బి.యాదగిరి రూ.15వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి - బడంగ్పేట్ నగర పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ సర్వేనెంబర్. 4లో ముస్త్తాక్ అనే వ్యక్తికి ఆరు గుంటల భూమి ఉంది.
ఆరు నెలల కిందట సర్వే కోసం సరూర్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమి సర్వే చేయాలని సర్వేయర్ యాదగిరికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.రూ.50వేలు ఇస్తేనే సర్వే చేస్తానని ముస్త్తాక్ చెప్పాడు. చివరకు రూ. 35 వేలకు ఒప్పంద కుదుర్చుకున్నాడు.
ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయం వెనుకభాగంలో ముస్తాక్ 15వేల రూపాయలు యాదగిరికి ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ సారథ్యంలో పట్టుకున్నారు.
రూ. 50 వేలు డిమాండ్
మొదట రూ. 50 వేలు డిమాండు చేసిన యాదగిరి చివరకు రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. రూ. 15వేలు ముందు ఇవ్వాలని పని అయిపోయిన తర్వాత రూ. 20వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఎసిబికి ఈ నెంబర్లకు పోన్ చేసి..
ప్రభుత్వ ఉద్యోగలు ఏవరైనా అవినీతికి పాల్పడితే 9440446109, 9440446140ల్లో సంప్రదించాలన్నారు. కాగా, ఏసీబీ అధికారులు సర్వేర్ యాదగిరి ఇంటిపై సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.
వరుసగా ఇలా..
రెండేళ్ల నుంచి సరూర్నగర్ మండలంలో వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కడంతో అధికారులు ఉలికి పడ్డారు. గతంలో మండల కార్యాలయంలో వీఆర్ఓ శ్రీనివాస్రావు, వీఆర్ఏ పెంటయ్య అవినీతి అధికారులకు చిక్కాడు. మరి కొంత మంది అధికారులు నకిలీ పాసు పుస్తకాల తయారీ, రికార్డుల తారుమారు విషయంలో సస్పెండ్ అయిన సంఘటనలు ఉన్నాయి.
అనుమానంతో సర్వేకు దరఖాస్తు
తమ భూమిలోని కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు ఆక్రమించుకున్నారని షేక్ నన్నేసాహెబ్కు అనుమానం వచ్చింది. దీంతో స్థలాన్ని సర్వే చేయాలని సరూర్నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు.
ఖాళీ ప్రదేశంలో ఇలా...
మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.15వేలు తీసుకుని వచ్చిన ముస్తాక్ను.. కార్యాలయం ఆవరణలో వెనుక వైపున్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ముస్తాక్ ఇచ్చిన డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు.