మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?
ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవటంపై ఆయన ఫైర్ అయ్యారు. అగ్ర కుల అహంకారంతో సీఎం అంబేద్కర్ ను అవమానించారని ఆయన అన్నారు. అయితే మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలకు పిడమర్తి రవి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగని తప్పు బట్టారు.
మందకృష్ణ మాదిగ ఎప్పుడైనా తన జీవితంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వ హించారా..? అని ప్రశ్నించారు పిడమర్తి రవి . మందకృష్ణ మాదిగ ఓ ప్రతిఘాతక అంబేద్కర్ వాదని తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ జయంతికి రానంత మాత్రాన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా..? అంటూ ప్రశ్నించిన పిడమర్తి రవి ఇక్కడున్న తెలంగాణ నాయకులని మందకృష్ణ మాదిగ ఆంధ్ర నాయకులకు అమ్ముకున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన మందకృష్ణ ఆ పార్టీ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారని ఎద్దేవా చేశారు.రాహుల్ గాంధీ ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చారా..? కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశం ఉందా...? అని పిడమర్తి రవి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం తీరుకు నిరశనగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్టు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మరోవైపు వీహెచ్ కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టకుంటే ఆందోళన బాట పడతానని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగనుందో మరి ..