రాహుల్ రాజకీయ నిరుద్యోగి, ఓయూకు వస్తే ప్రతిఘటనే: పిడమర్తి
హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగి అయిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తెలంగాణ విద్యార్థులకు ఏం చేస్తారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టిఎస్ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ ఎద్దేవా చేశారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో నోరుమెదపలేదన్నారు.
2009 డిసెంబర్ 23న కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో 1000మందికిపైగా విద్యార్థి, యువకులు ప్రాణాలు కోల్పోయారని పిడమర్తి, దూదిమెట్ల చెప్పారు. కనుక తెలంగాణలో, ఉస్మానియా విశ్వవిద్యాలయ(ఓయూ) పరిధిలో పర్యటనకు ముందు అమర వీరుల కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన తప్పులకు సమాధానం చెప్పకుండా రాష్ట్రంలో, ఓయూలో పర్యటిస్తే రాహుల్కు ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు ఢిల్లీకి వెళ్లి రాహుల్తో సమావేశమై రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వారు అన్నారు.
ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకుల లాబీయింగ్తో మోసపోయి.. అనేకమంది అమరులైతే.. ఆందోళనకారులపై లాఠీదెబ్బలు, జైలు నిర్బంధాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని మండిపడ్డారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నేతలకు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క టిక్కెటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
అనవసర కారణాలతో ప్రజల మధ్య తిరగాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్కలకు గుణపాఠం తప్పదని పిడమర్తి, దూదిమెట్ల స్పష్టంచేశారు.