వర్కౌట్ కాని కారు.. పదహారు ఫార్ములా..! కాళేశ్వరంతో కాషాయానికి దగ్గరవ్వాలనుకుంటున్న గులాబీ బాస్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్చ రావు మనసు మళ్లీ ఆ స్నేహం కోసం పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో కలిసి ఉండి మద్యలో మనస్పర్థలతో దూరమయ్యి, ఇప్పుడు మళ్లీ కమలంతో స్నేహ హస్తం అందుకోవడానికి ఆయన వెంపర్లాడుతున్నట్టు సమాచారం. ఇంతలో ఎంతమార్పు. సరిగ్గా నెల రోజుల క్రితం వరకూ ఊరూవాడా పట్టుకుని.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడిన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎందుకొచ్చిన తంటా స్వరాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుంటే చాలను నిర్ణయానికి వచ్చారు. అదృష్టం ఏమిటంటే.. 2018లో ముందస్తుకు వెళ్లటం వల్ల గులాబీ జెండా ఎగురవేయగలిగామనే వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరించటం. దాన్నే బలంగా భావించిన చంద్రశేఖర్ రావు రెండోసారి సీఎం కాగానే 28 రాష్ట్రాల్లో కూడా చంద్రశేఖర్ రావు వంటి సీఎం లేడనే అతి ఆత్మవిశ్వాసానికి చేరారు. భారీ మెజార్టీ సీట్లు సాధించటం కూడా దీనికి కారణమైంది.
బీజేపిపై దూకుడు పెంచిన కేసీఆర్..! రెండో సారి ఆదిక్యం చూసి అవాక్కయిన గులాబీ బాస్..!!
ఐదేళ్లపాటు తన పరిపాలనకు జనం మెచ్చి ఇచ్చిన మెజార్టీగా భావించాడు చంద్రశేఖర్ రావు . అయితే.. బీజేపీ, కాంగ్రెస్ బలహీనతతోపాటు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి వేలుపెట్టడం తమకు కలసివచ్చేలా చేసిందని గుర్తించలేకపోయారు. అనంతరం స్థానిక ఎన్నికలు జరిగాయి. మూడో దఫా పార్లమెంటరీ ఎన్నికలు మొదలయ్యాయి. 17 ఎంపీ సీట్లలో 16 కారుకే నంటూ చంద్రశేఖర్ రావు, పదహారు అనే నినాదంతో అతి ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రచారం చేపట్టారు.
కేంద్రంతో వైరం వద్దు..! దోస్తీనే ముద్దంటున్న కేసీఆర్..!!
అయితే.. మూడు నెలల ముందుగానే ఎమ్మెల్యేలు ప్రచారంలో అలసిపోయారు. పైగా కాసులు కుమ్మరించి జేబులు కూడా ఖాళీ అయ్యాయి. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల గెలుపు కోసం అంత ఉత్సాహంగా జనాల్లోకి వెళ్లలేకపోయారు. పైగా జాతీయపార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండాలనే ప్రజల ఆలోచనతో భాజపా, కాంగ్రెస్లు ఊహించని విధంగా సీట్లను గెలుచుకున్నారు. గులాబీపార్టీ సగానిపై గా సీట్లతో పదహారు దక్కలేదని ఢీలా పడాల్సి వచ్చింది. నరేంద్రమోదీపై చంద్రబాబుతోపాటు చంద్రశేఖర్ రావు కూడా తెగ విమర్శలు గుప్పించాడు. అస్సలు మోదీ అనే వ్యక్తిని జనం దేశం మరచిపోయారంటూ ఘాటుగానే ఆరోపణలు చేశారు.
కాళేశ్వరంతో మళ్లీ కలయిక..! బీజేపి అగ్ర నాయత్వం స్పందన ఏంటి..!!
అయినా.. 300 పై చిలుకు స్థానాలతో కాషాయపార్టీ మరోసారి పవర్లోకి వచ్చింది. పశ్చిమబెంగాల్లోనూ బాజపా ఊహించని విధంగా సీట్లు గెలవటంతో కేసీఆర్ గొంతులో వెలక్కాయ పడినట్టయింది. తెలంగాణలో భాజపాకు పెరుగుతున్న కీర్తి కూడా బాస్లో కలవరపాటుకు కలిగించాయి. దీంతో.. తాను ఒంటరిని అవుతాననే భయం వెంటాడుతోంది. కవిత ఓటమి కూడా దీనికి మరింతగా ఆజ్యంపోసింది. అందుకే రూటుమార్చి.. కమలంతో గులాబీ దోస్తీకోసం నానా ప్రయత్నాలు సాగిస్తున్నారట. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని అవకాశం చేసుకుని తనకూ ఓ అండను చుట్టూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రారంభోత్సవమా.. స్నేహ హస్తమా..! ఆసక్తిరేపుతున్న రాజకీయాలు..!!
ఇందులో భాగంగా మహారాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ను కలిశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన సీఎం చంద్రశేఖర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా సీఎం చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించారు. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను కూడా చంద్రశేఖర్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని వీరిని చంద్రశేఖర్ రావు ఆహ్వానించడం వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది.