అదే సంకేతం: తెరాసలోకి పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి హైదరాబాదులో మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. దివంగతన నేత పి. జనార్ధన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మనవడికి ఆయన సత్కారం చేయడంతో ఆ ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే ఆయన సోదరి విజయారెడ్డి తెరాసలో ఉన్నారు.
విజయారెడ్డి తెరాస నుంచి హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహచ్ఎంసి) కార్పోరేటర్గా కూడా ఎన్నికయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున శాసనసభకు పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆయన తెరాసలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగానే సాగుతోంది. అయితే, ఇటీవల పరిణామం ఆ ప్రచారానికి బలాన్నిస్తోందని అంటున్నారు.
గత ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున శానససభకు పోటీ చేసిన విష్ణు సోదరి విజయారెడ్డి ప్రస్తుతం తెరాస తరపున కార్పొరేటర్ గా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి పోటి చేసి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే తెరాసలో చేరారు.
దాంతో జూబ్లీహిల్స్ టికెట్ విష్ణువర్ధన్ రెడ్డికి రావడం కష్టమేనని అంటున్నారు. అయితే పిజెఆర్కు ఉన్న ప్రజాదరణ దృష్ట్యా చుట్టుపక్కల ఏ నియోజకవర్గం నుంచైనా విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయగలుగుతాడు. ఖైరతాబాద్ మాత్రం ఆయనకు పెట్టని కోట అయ్యే అవకాశం ఉంది.
ఖైరతాబాద్ శాసనసభ టికెట్ విజయారెడ్డికి ఇస్తే ఆయన మరో సీటు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి తెరాసలో చేరడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అందుపల్లనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వచ్చిన కేసీఆర్ మనవడికి విష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేక సత్కారం జరిగిందని అంటున్నారు.