26న రాష్ట్రానికి ప్రధాని రాక.!ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనున్న మోదీ.!
ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి బీజేపి జాతయ నేతలు, కేంద్ర మంత్రులు క్యూ కడుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలో రాష్ట్రానికి అగ్ర నేతలు వస్తుండడంతో నేతల మద్య సందడితో పాటు బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరనుందనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్
సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు ముఖ్య నేతలు.

ప్రధాని నరేంద్ర మోదీ నగరాకి రాక..ఘన స్వాగతం పలికేందుకు ముఖ్యనేతల సన్నాహాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతే ఉత్సాహంతో ప్రధానికి స్వాగతం పలకాలని బీజేపి ముఖ్య నేతలు కార్యచరణ రూపొందిస్తున్నారు.

తక్కువ రోజుల్లో ఎక్కువ మంది బీజేపి నేతల రాక.. తెలంగాణలో సందడి చేస్తున్న బీజేపి అగ్ర నేతలు
మరోవైపు అతి తక్కువ రోజుల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రానికి వస్తుండటంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీ నగర పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు బండి సంజయ్ కుమార్.

తెలంగాణ బీజేపికి అన్నీ విజయాలే.. ప్రధానికి వివరించాలనే ఉత్సాహంలో రాష్ట్ర నేతలు
ఇప్పటికే బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతం కావడంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమాచారం అందడంతో బీజేపీ శ్రేణులు మోదీ రాకకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

విజయాలకు కొనసాగింపుగా మోదీ పర్యటన.. కసరత్తు చేస్తున్న బండి సంజయ్
పాదయాత్ర విజయవంతం, హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ఎంసీ అనూహ్య విజయాల పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు.తుక్కుగూడ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమీత్ షా పార్టీ క్యాడర్ లో తీసుకొచ్చిన ఉత్సాహానికి కొనసాగింపుగా ప్రధాని మోదీ పర్యటనను రూపొందించాలనే సకల్పంతో బీజేపి ముఖ్య నేతలున్నట్టు స్పష్టమవుతోంది.