మోడీ హత్యకు భారీ కుట్ర?: డబ్బులు సమకూరుస్తారంటూ లేఖలో వరవరరావు పేరు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు భారీ కుట్ర జరిగిందని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. భీమా కోరేగావ్ ఘటన అరెస్టులు జరిగినప్పుడు ఈ లేఖ దొరికిందని పుణే పోలీసులు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ హత్య, భారత దేశం ముక్కలు కావడం ఖాయం: హఫీజ్ అనుచరుడు
ఆ లేఖలో రాజీవ్ గాంధీ తరహా హత్య ప్రస్తావించారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇది మోడీ కోసం వేసిన స్కెచ్ అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర లేఖలో వరవర రావు పేరు కూడా ఉందని చెబుతున్నారు. వరవర రావు పేరును ఓ నిందితుడు జాకబ్ విల్సన్ తన లేఖలో ప్రస్తావించారని చెబుతున్నారు.
ప్లాన్ అమలుకు కావాల్సిన నగదు వరవర రావు సమకూరుస్తారని విల్సన్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. విల్సన్ లేఖలో వరవర రావు పేరు ఉండటంతో ఆయనను పుణే పోలీసులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందించింది. బీజేపీ ప్రభ తగ్గినప్పుడల్లా కుట్ర కథలు బయటకు వస్తాయని కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ అన్నారు. ఇలాంటి కట్టు కథలు అల్లడం మోడీ టెక్నిక్ అన్నారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి కథలే చెప్పారన్నారు. లేఖలోని అంశాలపై దర్యాఫ్తు జరపాలన్నారు.
'రాజీవ్ గాంధీ తరహా': ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర
ఇదంతా అవాస్తవం: వరవరరావు
తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని వరవర రావు ఓ టీవీ ఛానల్తో చెప్పారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రభ తగ్గిపోతుందని చెప్పారు. తనను కావాలనే టార్గెట్ చేశారన్నారు. అయినా ప్రధానిని హత్య చేసే శక్తి మావోయిస్టులకు ఉందా అనేది అనుమానమే అన్నారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారన్నారు. విల్సన్తో నాకు సంబంధం లేదని చెప్పనన్నారు. కానీ తనను, విల్సన్ను అరెస్టు చేయడం కోసమే ఈ కుట్ర అన్నారు.