హైదరాబాద్ మెట్రో అద్భుతం, నేను నడపాల్సింది రైలును కాదు, దేశాన్ని: మోడీ, విరిసిన నవ్వులు
Recommended Video
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా సరదాగా గడిపారు. మెట్రో స్టేషన్లు, కోచ్లు అద్భుతంగా ఉన్నాయని మోడీ కితాబిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా 'నేను ముందుకు నడపాల్సింది రైలును కాదు... దేశాన్ని' అని మోడీ అధికారులతో వ్యాఖ్యానించడం అందర్నీ నవ్వుల్లో ముంచింది.
స్పెషల్ అట్రాక్షన్: కేటీఆర్ లేకుండా 'మెట్రో' రిబ్బన్ కట్ చేయని మోడీ(వీడియో)
మంగళవారం హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణిస్తూ- ఎల్అండ్టీ మెట్రోరైలు సంస్థ ఎండీ శివానంద నింబార్గిని ఉద్దేశించి ఈ మాటలన్నారు. మియాపూర్-కూకట్పల్లి మెట్రో స్టేషన్ల నడుమ 11 నిమిషాల ప్రయాణంలో మోడీ అనేక విషయాలను ప్రస్తావించారు.
అంతా కంట్రోల్ సెంటర్ నుంచే
హైదరాబాద్ మెట్రోరైలు లోకో పైలట్ (డ్రైవరు)తో పెద్దగా సంబంధం లేకుండానే, ఉప్పల్ డిపోలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం ఆధారంగా నడుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హైదరాబాద్లో తిరిగే 57 రైళ్లలో మహిళలనే లోకో పైలెట్లుగా నియమించింది.
మెట్రోను కాదు దేశాన్ని ముందుకు నడపాలి..
ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, ఎల్అండ్టీ మెట్రో ఎండీ శివానంద నింబార్గి...‘లోకో పైలెట్ ఉన్న ఇంజిన్ క్యాబిన్ను పరిశీలిస్తారా?' అని ప్రధానిని అడిగారు. ఇందుకు ప్రధాని... ‘నేను నడపాల్సింది రైలు బండిని కాదు. దేశాన్ని సమర్థంగా ముందుకు నడపాలి' అని ఎంతో చాకచక్యంగా నవ్వుతూ స్పందించారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
ప్రధానితో మెట్రో ప్రత్యేకతలు పంచుకున్నారు..
మెట్రోలో ఏర్పాటుచేసిన అత్యాధునిక సాంకేతికత, తాము నిర్మిస్తున్న మాల్స్, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకార్యాలు తదితర వివరాలను నింబార్గి ప్రధానికి తెలియజేశారు. ప్రధాని పక్కనే కూర్చున్న మంత్రి కేటీఆర్... మెట్రోకు సంబంధించిన అనేక విషయాలను ఆయనకు వివరించారు.
మోడీ-కేటీఆర్
మహానగరంలో అభివృద్ధి పనుల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (జీహెచ్ఎంసీ) తరఫున రూ.వెయ్యి కోట్లను బాండ్ల రూపంలో సమకూర్చనున్నట్లు ప్రధానికి కేటీఆర్ తెలిపారు. ఇందుకు ప్రధాని స్పందిస్తూ- 1999లోనే తాము అహ్మదాబాద్ నగరాభివృద్ధి కోసం బాండ్ల రూపంలో రూ.వెయ్యి కోట్లను సేకరించినట్లు మోడీ తెలిపారు. ఆ అభివృద్ధి పనులను ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తించుకున్నారని చెప్పారు.
గుజరాత్ తరహాలో..
గుజరాత్లోని సబర్మతీ నది తరహాలో హైదరాబాద్లోని మూసీనదిని కూడా అభివృద్ధి చేస్తున్నామని ప్రధానికి కేటీఆర్ చెప్పారు. ‘గుజరాత్లో సబర్మతీ నదిని అద్భుతంగా అభివృద్ధి చేశాం. దీనివల్ల అక్కడ చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. కాలుష్యానికి తెర పడటమే కాకుండా, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది' అని మోడీ తెలిపారు. సబర్మతీ లాగే మూసీని కూడా చక్కగా అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు.
శంషాబాద్ వరకు మెట్రో..
మెట్రోరైలు, శంషాబాద్ విమానాశ్రయాల మధ్య ప్రస్తుతం అనుసంధానం లేదనీ... దీన్ని కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ చెబుతుండగానే ప్రధాని స్పందించారు. విమానాశ్రయానికి తప్పనిసరిగా మెట్రో సౌకర్యం ఉండాలని, దానిని ఏర్పాటుచేస్తే బావుంటుందని మోడీ సూచించారు.
అద్భుతమన్న మోడీ ..
అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మెట్రో స్టేషన్లు, కోచ్లు అద్భుతంగా ఉన్నాయమని ప్రధాని మోడీ అన్నారు. హైదరాబాద్ నగరంలో లానే దేశంలోని ఇతర నగరాలు కూడా మెట్రోను విస్తరించాలని అన్నారు. హైదరాబాద్ మెట్రో మోడల్ బాగుందని మోడీ మెచ్చుకున్నారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా తమ మెట్రోలను ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలని అభిప్రాయపడ్డారని చెప్పారు. మెట్రో ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోడీ ప్రయాణించిన విషయం తెలిసిందే. మోడీ పక్కనే మంత్రి కేటీఆర్, మరో పక్కన గవర్నర్ నర్సింహన్, సీఎం కేసీఆర్, ఎదురుగా మెట్రో అధికారులు కూర్చున్నారు.