ఇవాంకాతో వన్స్మోర్ అనిపించుకున్న చంద్రమోహన్ కూతురు, కోటను చూశాక ఏమన్నారంటే
Recommended Video
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ప్రముఖ నటుడు చంద్రమోహన్ కూతురు మాధవి ఇక్కడ కూచిపూడి నృత్యంతో ఆహోతులను అలరించారు.
ఈ విషయం చెప్పండి! మోడీ-కేసీఆర్లతో ఇవాంకా సరదాగా: ఇరుకైన దారి, అతిథులకు చేదు
చంద్రమోహన్ కూతురుతో పాటు మరికొంతమంది నృత్యం చేశారు. వారి నృత్యం అందరినీ కట్టిపడేసింది. వేదిక చప్పట్లతో మార్మోగిపోయింది. ఇవాంకా ట్రంప్ సహా అందరూ వన్స్మోర్ అన్నారట. కూచిపూడితో పాటు భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మణిపురి వంటి సంప్రదాయ నాట్యాలు అన్నింటిని కలిపి ప్రదర్శించారు.
ఇవాంకాతో పాటు వీరు
ఫలక్నుమా ప్యాలెస్లో ఇవాంకాకు కేంద్ర ప్రభుత్వం విందు ఇచ్చింది. చారిత్రాత్మకమైన ఫలక్నుమా ప్యాలెస్లో హోటల్లో విశాలమైన డైనింగ్ హాలులో ఈ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన డైనింగ్ హాల్. 101 మంది కూర్చొని తినేలా ఈ డైనింగ్ హాల్ ఉంటుంది.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా
ప్రధాని మోడీ, ఇవాంకా, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్, రాష్ట్రమంత్రి కేటీ రామారావు తదితరులు కలిసి భోజనం చేశారు. వ్యాపార దిగ్గజాలలో రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఆది గోద్రేజ్, కుమార మంగళం బిర్లాలతో పాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన, శోబనా కామినేని, అపోలో సి ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సంజేష్ నేతృత్వంలో వంటకాలు
ఈ విందులో 12 రకాల బిర్యానీలు వడ్డించారు. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకం. చికెన్, మటన్ ధమ్కీ బిహర్యానీ, షీప్ కబాబ్, మొఘలాయి, జింజర్ చికెన్ వంటి ఎన్నో రకాల పదార్థాలు వడ్డించారు. భారతీయ శాకాహార, మాంసాహార వంటలు రుచి చూపించారు. వాటితో పాటు చైనీస్, ఇటలీ, ఫ్రాన్స్, కరేబియన్ వంటకాలను డ్డించారు. ప్యాలెస్లో ప్రధాన చెఫ్ సంజేష్ నాయర్ నేతృత్వంలో ఈ వంటకాలు తయారు చేశారు.
ఆ గైడ్ రాలేదని
ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటలో సందర్శించినప్పుడు గైడ్ నియామకం విషయంలో తొలుత కొంత గందరగోళం ఏర్పడింది. కోట చరిత్రను వివరించేందుకు పర్యాటక శాఖ నుంచి మహిళా గైడ్ను పంపాలని ఆ శాఖ అధికారులను పోలీసులు కోరారు. వారు పంపిన గైడ్ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీంతో రాజగోపాలన్ను గైడ్గా కోట వద్దకు తీసుకు వచ్చారు.
చివరి నిమిషం వరకు గోప్యంగా
గోల్కొండ కోట ను ఇవాంకా ట్రంప్ సందర్శించే అవకాశం ముందని ముందుగా తెలిసినా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు. బుధవారం ఉదయం నుంచే కోట వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇవాంకా ఆశ్చర్యం
కాగా, గోల్కొండ కోట సందర్శనలో ఇవాంక ఆద్యంతం ఉత్సాహంగా గడిపారు. కోట చరిత్రను వివరిస్తూ గైడ్ చెప్పిన అంశాలను ఆసక్తిగా విన్నారు. అప్పట్లో కోటను ఎలా నిర్మించారు? నీటి సరఫరా ఎక్కడి నుంచి, ఎలా జరిగేది? తదితర వివరాలు తెలుసుకున్నారు. క్లాపింగ్ పోర్టికోలో చప్పట్ల చప్పుడు గురించి గైడ్ వివరిస్తున్న సమయంలో ఆమె ఆశ్చర్యానికి లోనయ్యారు.
శబ్దం ఎలా వినిపిస్తుందని ఆరా
ఇక్కడ చప్పట్లు కొడితే దర్బార్ హాల్లో ఎలా వినిపిస్తుంది?అందులోని సాంకేతికత ఏమిటి? అని ఇవాంకా గైడ్ను ప్రశ్నించారు. తను కూడా స్వయంగా చప్పట్లు కొట్టి ఆ అనుభూతిని అస్వాదించారు. దానిపై గైడ్ వివరించారు.
రాణీ మహల్ సమీపంలోని ప్రదేశాల సందర్శన
ఆ తర్వాత ఆమె రాణిమహల్ సమీపంలోని ప్రదేశాలను చూశారు. అక్కణ్నుంచి ఆయుధాగారానికి వచ్చారు. అప్పటి ఆయుధాల ఉపయోగంపై వాకబు చేశారు. ఫిరంగులు పని చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.
కోటను చూశాక ఇవాంకా ఏమన్నారంటే
కోటను చూసిన తర్వాత ఇవాంక మాట్లాడారు. పురాతన, పెద్దదైన ఈ కోటను సందర్శించడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని, ఇదో అద్భుతమైన ప్రదేశమని, సుసంపన్నమైన హైదరాబాద్ సంస్కృతికి ఇదో తార్కానం అన్నారు.