ప్రధాని మోడీ కనీసం అపాయింట్మెంట్ కూడ ఇవ్వడం లేదు : రేవంత్ రెడ్డి
పలు అంశాల్లో ట్విట్టర్లో స్పందించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యలపై చర్చించేందుకు కనీసం ఎంపీలకు అపాయింట్మెంట్ కూడ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ విభజించి పాలించు అనే కోణంలో వ్వవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. నోట్ల రద్దు వికటించి దేశ ఆర్ధికపరిస్థితి తిరోగమన దిశగా వెళుతుందని ఆయన విమర్శించారు. అయినా మోడీ మాట్లాడేందుకు సిద్దంగా లేరని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇతర నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారత్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత సోనియా గాంధీతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుండి సుమారు నాలుగు వేల మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లారు. ఈనేపథ్యంలోనే మోడీ విధానాలపై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మరోవైపు రాష్ట్ర అభివృద్దిపై ఆయన స్పందించారు. సీఎం కేసీఆర్ దోపిడిని ఆపివేస్తేనే... రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు. సీఎం రాచరిక పాలనలో రాష్ట్రం బందీ అయిందని విమర్శించారు. కేసీఆర్ విధానాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.