హైదరాబాద్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ప్రాపర్టీ ట్యాక్స్ను సమర్థవంతంగా వసూలు చేస్తున్నపుడు దేశంలోని మిగతా నగరాలెందుకు వసూలు చేయడం లేదని అధికారులను ఆయన ప్రశ్నించారు.
గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో పట్ణణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా మోడీకి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు తీసుకున్న చర్యలను వివరించిన అనంతరం పైవిధంగా స్పందించారు.
జులై 3న యాదగిరిగుట్టలో రాష్ట్రపతి పర్యటన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ నగరంలో విడిది చేసేందుకు రానున్నారు. జూన్ 29న రాష్ట్రపతి నగరానికి చేరుకోనున్నారు. వచ్చే నెల(జులై) 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు.
యాదాద్రిపై కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం హరితహారం పథకం, గురుకుల కాలేజీ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.
మహిళల కోసం నిర్భయకేంద్రాలు: హరీశ్ రావు
మెదక్: మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి హరీష్రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళల రక్షణ కోసం ప్రతిఒక్కరు కదలిరావాలని మంత్రి హరీష్.. ప్రజాప్రతినిధులు,కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసమే కాకుండా చిన్నారులను మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్, జేసీ వెంకటరామిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.