కెసిఆర్ను ఫాలో కండి!: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ కితాబు
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పని తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, సత్సంబంధాలతో పనులు సాధించుకోవడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.
ఇతర రాష్ట్రాల కంటే ముందున్నారని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మకు ప్రధాని మోడీ కితాబిచ్చారు. బుధవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 12 అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని సమీక్షించారు.
అటవీ, పర్యావరణ, రైల్వే తదితర వాటికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు సాధించడానికి తెలంగాణ అధికారులు చక్కటి సమన్వయంతో వ్యవహరిస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా వాల్టా చట్టం (వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్), కేంద్రం పథకాల అమలులో పనితీరు బాగుందని ప్రధాని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అంశాన్ని రాజీవ్ శర్మ ప్రధాన మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరగా పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారని తెలుస్తోంది.
పరిశ్రమలతో పాటు వివిధ ప్రాజెక్టులకు అనుమతుల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం భేష్ అని ప్రధాన మంత్రి మోడీ అభినందించారు. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని పాటించాలని సూచించారు.
తెలంగాణ అధికారులు రాష్ట్రంలో అమలులో ఉన్న తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్ఐపాస్), పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం తదితర అంశాల గురించి ప్రధానికి వివరించారు. నిర్ణీత గడువులోగా అనుమతులు జారీగాని పక్షంలో నేరుగా అనుమతులు పొందినట్లు (డీమ్డ్ ఆప్రూవల్) భావించే విధానం చేపట్టడం దేశంలోనే ప్రథమమని తెలిపారు.
ఇది ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానికి చెప్పారు. వెంటనే ఆయన తెలంగాణ సీఎస్ను, అధికారులను అభినందించారు. పెట్టుబడుల సమీకరణ, యువతకు ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అని రాష్ట్రాల్లో సరళతర వ్యాపార నిర్వహణ విధానాలను చేపట్టాలని పిలుపునిచ్చిందన్నారు.
కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా ఈ తరహా సంస్కరణలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగాలని సూచించారు. వెంటనే సీఎస్ రాజీవ్ శర్మ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కేంద్రం పేదల కోసం ఖర్చు పెడుతున్న ఏ ఒక్క రూపాయి కూడా అనర్హులకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రధాన మంత్రి సూచించారు.