గాంధీ భవన్కు తాళం, సర్వే దిష్టిబొమ్మ దగ్ధం: ఫిబ్రవరిలో తెలంగాణకు మోడీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల టిక్కెట్ గొడవ ఆఘడం లేదు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని గాంధీ భవన్కు కొందరు కార్యకర్తలు తాళం వేశారు. వారు మల్కాజిగిరి కార్యకర్తలుగా తెలుస్తోంది.
తనకు గౌతమ్ నగర్ డివిజన్ టిక్కెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని జ్యోత్స్న అనే నాయకురాలి వర్గీయులు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. సర్వే సత్యనారాయణ టిక్కెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్కు తాళం వేశారు.
తెలంగాణకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి హన్సరాజ్ గురువారం నాడు చెప్పారు. ప్రధాని ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణకు వస్తారని చెప్పారు.
మరో నాలుగేళ్ల వరకు యూరియా, డిఏపి ధరలు పెంచమని చెప్పారు. తద్వారా రైతులకు ధరల పెరుగుదల భారం తప్పనుంది. బొగ్గు ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పదహారు కోట్ల మంది రైతులకు భూసార పరీక్ష కార్డులు అందిస్తామన్నారు.