హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్తో మోడీ ముచ్చట్లు: కరోనా వారియర్గా అభివర్ణించిన ప్రధాని.. !
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్కు చెందిన తొలి కరోనా వైరస్ పేషెంట్ రామ్గంప తేజతో మాట్లాడారు. ఆయనను కరోనా వారియర్గా అభివర్ణించారు. కరోనా వైరస్ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ.. పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ.. తేజకు అందించిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత నరేంద్ర మోడీ.. తేజకు ఫోన్ చేశారు. మీతో కొన్ని విషయాలను మాట్లాడాలనుకుంటున్నా.. అంటూ మోడీ అతనితో తన సంభాషణను ప్రారంభించారు. కరోనా వైరస్ సోకిన అనంతరం ఆయన స్థితిగతుల గురించి ఆరా తీశారు. వైద్య చికిత్స ఎలా అందిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వైరస్ ఎలా సోకిందో? దాన్ని ఎలా ఎదుర్కొన్నారో.. వివరించాలని, తోటి పేషెంట్లకు ధైర్యాన్ని అందించాలని సూచించారు.
PM Shri @narendramodi is speaking to Shri Ram Gampa Teja ji who has defeated #COVID19 and is a #CoronaWarrior . He is a IT professional and had gone to Dubai for work.
— Mann Ki Baat Updates (@mannkibaat) March 29, 2020
Live - https://t.co/Wxo1ub3POT#IndiaFightsCorona #MannKiBaat @MoHFW_INDIA @drharshvardhan pic.twitter.com/Bea1Q41JE4
తనకు వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని రామ్గంప తేజ ఫోన్ ద్వారా వివరించారు. తాను ఐటీ నిపుణుడినని, ఓ అత్యవసర సమావేశంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తెలిసో, తెలియకో ఈ వైరస్ దుబాయ్లోనే తనకు సోకి ఉంటుందని వెల్లడించారు. స్వస్థలానికి వచ్చిన వెంటనే జ్వరంతో బాధపడ్డానని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లగా రక్త పరీక్షలు చేశారని చెప్పారు.
తనకు కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని డాక్టర్లు అయిదారు రోజుల తరువాత ధృవీకరించారని వివరించారు. ఆ వెంటనే తనను గాంధీ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. 14 రోజుల తరువాత నయం అయిందని అన్నారు. ఈ 14 రోజుల పాటు తాను భయంభయంగా గడిపానని అన్నారు. అనంతరం మోడీ స్పందిస్తూ.. తేజ నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. ఆయనను కరోనా వారియర్గా మోడీ అభివర్ణించారు.