మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇందులో కార్యక్రమాల జాబితా వెల్లడించలేదు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇందులో కార్యక్రమాల జాబితా వెల్లడించలేదు.
Recommended Video
మన మెట్రోదే ఆ రికార్డు: టికెట్ ధరపై కేటీఆర్, అటు టెస్టులు, ఇటు స్పీడ్(పిక్చర్స్)
ఒకటి రెండు రోజుల్లో సమాచారం పంపిస్తామని పీఎంవో తెలిపింది. అమెరికా, భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు హైదరాబాదులో జరగనుంది.
శిఖరాగ్ర సదస్సు తర్వాత
దీని ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశముంది. అదే రోజు రాత్రి అతిథులకు ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే విందులోను ప్రధాని పాల్గొనాలి. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలుకు మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
మెట్రో రైలు ప్రారంభోత్సవంపై సస్పెన్స్
శిఖరాగ్ర సదస్సు తర్వాత మెట్రో రైలు ప్రారంభోత్సవం జాబితాలో ఉంటుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారయినప్పటికీ షెడ్యూల్ లేదు.
కేటీఆర్ ఏం చెప్పారంటే
నవంబర్ 28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధంచేసినట్టు మంత్రి కేటీ రామారావు సోమవారం క్వశ్చన్ అవర్లో చెప్పారు. ఇందుకు సంబంధించి పీఎంవో నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మెట్రో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని ఆహ్వానించిందని తెలిపారు.
ఇప్పటి వరకు అయిన ఖర్చు
దేశ చరిత్రలో ఒకేసారి 30 కి.మీ. మేర మెట్రోను ప్రారంభించటం ఇదే మొదటిసారి అని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ.3 వేల కోట్లు కేటాయించారు. కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూర్చనుంది. ఇందులో రూ. 958 కోట్లు విడుదల చేసింది.. ఇప్పటివరకు రూ. 2,240 కోట్లు ఖర్చు చేశారు.
అమీర్ పేట వద్ద అదుర్స్
అమీర్ పేట మెట్రో రైల్ స్టేషన్ దేశంలోనే అదిపెద్దది. ఒకే సమయంలో ఆరువేల మందికి సరిపడా సౌకర్యాలు ఈ స్టేషన్లో ఉంటాయి. ఓ విధంగా విమానాశ్రయస్థాయిలో సౌకర్యాలు ఉంటాయి. 8 లిఫ్టులు, 16 ఎస్కలేటర్లు, గ్రానైట్ ఫ్లోరింగ్, ఎయిర్ కండిషన్ ప్రాంగణం, షాపింగ్ మాల్స్, వినోద కేంద్రాలు తదితరాలు ఉంటాయి.
ఇది ఇంటర్ ఛేంజ్ స్టేషన్
అమీర్ పేట ఇంటర్ చేంజ్ స్టేషన్లో అద్భుత వసతులు ఉన్నాయి. మూడు అంతస్తుల్లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉండేలా ఇంటర్ ఛేంజ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. గడువులోగా నిర్మాణం పూర్తి చేసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా పని చేస్తున్నారు.
అమీర్ పేట స్టేషన్ కీలకం
మియాపూర్ నుంచి అమీర్ పేట మీదుగా నాగోల్ వరకు ప్రారంభమయ్యే మెట్రో ప్రాజెక్ట్కు అమీర్ పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్ కీలకం. మియాపూర్లో మెట్రో ఎక్కిన ప్రయాణికుడు సికింద్రాబాద్ వెళ్లాలంటే అమీర్ పేటలో మారాలి.
అమీర్ పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్లో ఎన్నో
ఇంటర్ఛేంజ్ స్టేషన్ కాబట్టి ఏకకాలంలో ఆరు వేల మంది వచ్చినా రద్దీ ఏర్పడకుండా లిఫ్టులు, మెట్లు, ఎస్కలేటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో విశేషం ఏమంటే పునర్వినియోగ వ్యర్థాలతో రూపొందించిన నిర్మాణ సామగ్రితో తక్కువ వేడి ఉండేలా, తక్కువ విద్యుత్తు వినియోగించేలా, పర్యావరణానికి హాని చేయని విధంగా ఈ స్టేషన్ నిర్మించారు.
అమీర్ పేట ప్రత్యేకతలు
మెట్రో రైలు ప్రతి స్టేషన్లో ఇరవై సెకన్లు ఆగుతుంది. అమీర్ పేట స్టేషన్లో మాత్రం రెండు నిమిషాలు ఆగుతుంది. స్టేషన్ పైకప్పును మిగతా స్టేషన్ల పైకప్పు కంటే భిన్నంగా ఉంటుంది. వర్షపు నీటి సంరక్షణ ఏర్పాటు చేశారు. వ్యాపార, వినోద కేంద్రాలు ఉంటాయి.