సీఎం అక్కర్లేదు.. ఆ ఐదుగురికే అనుమతి... మోదీ టూర్పై పీఎంవో ఆదేశాలు.. అవాక్కయిన ప్రభుత్వం...
శనివారం(నవంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో హకీంపేట్ ఎయిర్ కమాండెంట్ కేవీ సురేంద్ర నాయర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయింది.
సాధారణంగా ప్రధాని అధికారిక పర్యటనల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్లు స్వాగతం పలకడం పరిపాటి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ వచ్చి స్వాగతం పలుకుతారని సీఎంవో కార్యాలయం పీఎంవో కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. అయితే గత సంప్రాదాయాలకు తిలోదకాలిచ్చేలా... సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం రావడం చర్చనీయాంశంగా మారింది. ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రిని రావొద్దన్నారన్న దానిపై అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వారు చర్చించుకుంటున్నారు.
కాగా,శనివారం సాయంత్రం 3.40 నిమిషాలకు మోదీ హైదరాబాద్లోని హకీంపేట్ విమానాశ్రయంలో దిగనున్నారు. అక్కడినుంచి సాయంత్రం 4గం.-5 గం. మధ్య జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శిస్తారు. ఆ సంస్థ తయారుచేస్తున్న కోవ్యాక్సిన్కి సంబంధించి సైంటిస్టులను వివరాలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 5.40 నిమిషాలకు ప్రధాని మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.
Recommended Video
హైదరాబాద్కు రావడానికి ముందు ప్రధాని మోదీ.. తొలుత అహ్మదాబాద్ వెళ్తారు. అక్కడ జైడస్ కాడిలా ప్లాంట్ను సందర్శిస్తారు.చంగోదార్ పారిశ్రామిక వాడలో ఉన్న ప్లాంట్కు వెళ్లి టీకాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అహ్మదాబాద్ నుంచి నేరుగా పుణె వెళ్తారు. అక్కడ సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న కోవీషీల్డ్ టీకా పనులపై సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.