చంద్రబాబు నన్ను కొట్టారు, చేతులు జోడించా, ఇప్పుడు చెప్తున్నా: పోచారం సంచలనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసన సభలో బుధవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన ఆరోపణలు చేశారు. తనను చంద్రబాబు కొట్టారని చెప్పారు.
నిజాం షుగర్స్ను ప్రయివేటీకరించవద్దని చెప్పినందుకు చంద్రబాబు తనను కొట్టారని ఆరోపించారు. తాను చేతులు జోడించి వేడుకున్నానని, అందుకు చంద్రబాబు అసహనానికి గురయ్యారని చెప్పారు. తాను ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని, తొలిసారి చెబుతున్నానని అన్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తనను తొడపైన కొట్టారని చెప్పారు. తొడ ఎర్రబడిందన్నారు. ఆ తర్వాత గన్మెన్ ద్వారా తనను లోపలకు పిలిపించుకున్నారని, 'సారీ శ్రీనివాస్ రెడ్డి, ఏదో ఇరిటేషన్తో కొట్టా' అని చంద్రబాబు చెప్పారని పోచారం తెలిపారు. అయితే, నిజాం షుగర్స్ ప్రయివేటీకరణ ఆయన సీఎం కాబట్టి ఆయన అనుకున్నదే చేశారన్నారు.
దీనిపై తెలంగాణ టిడిపి కార్యదర్శి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొట్టే దెబ్బలను పోచారం శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో చెబుతారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిజంగానే కొడితే ఆయన కేబినెట్లో అప్పుడు ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. దానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ... రూపాయి ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కాంగ్రెస్ మంత్రులు ఎలా కొనసాగారో చెప్పాలన్నారు.