ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా కొత్త పార్టీ ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల అసాధారణ స్పీడుతో దూసుకుపోతున్నారు. సమైక్యవాది వైఎస్ కూతురిగా, ఆంధ్రా సీఎం జగన్ సోదరిగా షర్మిలకు తెలంగాణలో ఆదరణ ఉండబోదన్న విమర్శలకు సమాధానంగా అత్యంత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పేరెన్నికగల ప్రముఖులను పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతున్నారు. తాజాగా..
వైఎస్ షర్మిలపై సంచలన ఆరోపణలు -బద్దలు కొట్టి ఎత్తుకెళతారన్న గంగుల -కేసీఆర్ వ్యూహం ఇదేనా?
లోటస్పాండ్లో అనూహ్య దృశ్యాలు
పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ వేదికగా పలువురితో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి తదితరులు షర్మిలను కలిశారు. అయితే, బుధవారం మాత్రం లోటస్ పాండ్ లో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కీలక రంగాల్లో బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతోన్న ఇద్దరు ప్రముఖులు, వైఎస్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ లు గా సేవలందించిన ఇంకొందరు మాజీ అధికారులు షర్మిలతో భేటీ అయినట్లు సమాచారం. ప్రధానంగా..
ప్రజాయుద్ధ నౌక గద్దర్ కొత్త జెండా?
సుదీర్ఘ కాలంపాటు నక్సలైట్ ఉద్యమ సమర్థకుడిగా, వందలాది ఉద్యమ పాటలతో జనాన్ని ఉర్రూతలూగించి, ప్రజా యుద్ధనౌకగా పేరుపొంది, నాలుగేళ్ల కిందట లెఫ్ట్ బాటను వీడి, ప్రజాస్వామిక రాజకీయాల్లోకి ప్రవేశించిన విప్లవ కవి గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు బుధవారం వైఎస్ షర్మిలతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్దర్.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లపై సునిశిత విమర్శలు చేశారు. అయితే, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన దరిమిలా గద్దర్ కొంత కాలంగా నాన్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తాజాగా షర్మిలతో సమావేశం ద్వారా గద్దర్ మళ్లీ రీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీలో చేరిక ద్వారా ఆయన కొత్త జెండా ఎత్తుతారా? అసలు భేటీ నిజమేనా? తదుపరి కార్యాచారణ ఏమిటన్నది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా,
చంద్రబాబు అడుగుల్లో వైఎస్ షర్మిల -కేసీఆర్కు దిమ్మతిరిగేలా స్ట్రాటజీ -కోటి ఎకరాలు వైఎస్ ఖాతాలోకి
షర్మిల పార్టీలోకి బ్రదర్ షఫీ!
కొత్త రాజకీయ పార్టీ నిర్మాణంలో తలమునకలైన షర్మిల తాజాగా గద్దర్ తోపాటు తెలంగాణ ప్రాంతానికే చెందిన అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీతోనూ భేటీ అయినట్లు సమాచారం. గతంలో యూనివర్సల్ ఇస్లామిర్ రెసర్చ్ సెంటర్ (యూఐఆర్సీ) అధ్యక్షుడిగా ఇస్లాంకు సంబంధించిన నిగూఢ విషయాలను ప్రచారం చేసిన బ్రదర్ షఫీ.. తర్వాతి కాలంలో కేవలం వ్యక్తిత్వ వికాస, ప్రేరణాత్మక ప్రసంగాలకే పరిమితం అయ్యారు. 'నేను సైతం సమాజం కోసం' అనే మిషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు, వ్యక్తులను మోటీవేట్ చేస్తోన్న షఫీ.. విద్యారంగంలో టీఆర్ఎస్ సర్కారు కృషిని కీర్తించడం, కేసీఆర్ కు దగ్గరి వ్యక్తులు పలువురు ఆయనను అభినందించడం లాంటివి ఇటీవల కూడా జరిగాయి. బ్రదర్ అనిల్ మాదిరిగానే తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన బ్రదర్ షఫీ.. షర్మిల పార్టీలో చేరబోతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. పార్టీలో కార్యకర్తలను, నేతలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో మోటివేట్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక..
సలహాదారులుగా వైఎస్ ఇష్టులు..
ఇంకా పార్టీ పెట్టకముందే.. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ షర్మిల.. తనపై ఉన్న 'ఆంధ్రా' బ్రాండ్ తొలగిపోయేలా 'పుట్టినిల్లు.. మెట్టినిల్లు' నినాదంతో ముందుకు వెళుతున్నారు. తాను తెలంగాణ కోడలినని.. ఇక్కడ పార్టీ పెట్టేందుకు తనకు హక్కు ఉందనే వాదనను షర్మిల టీమ్ రూపొందించింది. పుట్టిన ఇల్లు ఆంధ్ర.. మెట్టినిల్లు తెలంగాణగా షర్మిల ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. కాగా, షర్మిల కొత్త పార్టీకి సలహాదారులుగా ఇద్దరు మాజీ అధికారుల్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ కొప్పుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహా.. షర్మిల పార్టీ సలహాదారులుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎస్వోగా ఉదయ సింహా పని చేశారు. సీఎంవోలో ప్రభాకర్ రెడ్డి అడిషనల్ సెక్రెటరీగా పని చేశారు.
ప్రజా, కుల సంఘాలతోనూ షర్మిల..
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ప్రధానంగా రెడ్డి-దళిత కాంబినేషన్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ అభిమానుల్లో చాలా మంది రెడ్డి నేతలు ఉండటం, షర్మిలను కలుస్తోన్నవారిలో కూడా ఆ వర్గం నేతల సంఖ్యే ఎక్కువగా ఉండటం తెలిసిందే. అదే సమయంలో దళిత వర్గానికి చెందిన కీలక నేతలు కూడా ఆమెతో వరుసగా భేటీ అవుతున్నారు. ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలతోనూ ఆమె సమావేశం అవుతున్నారు. తాజాగా, తెలంగాణ మాల, మాదిగ సంఘాల కీలక నేతలు ఆమెను కలిశారు.పార్టీ పెడితే మాదిగల డిమాండ్లపై షర్మిలతో చర్చించినట్లు ఎమ్మార్పీఎస్ నేత ఇటికే రాజు తెలిపారు. కేసీఆర్ అరాచక పాలనకు ప్రత్యామ్నాయం కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చినట్లు మాల మహానాడు నేత చెన్నయ్య చెప్పారు. షర్మిల పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.