అశ్రు నయనాల మధ్య గూడ అంజయ్యకు కడపటి వీడ్కోలు
ఆదిలాబాద్: ప్రజా కవి, రచయిత గూడ అంజయ్యకు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్లో అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్లోని రామన్నగూడలో అంజయ్య తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఆయన కోరిక మేరకు స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి అంజయ్య పార్ధివదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ప్రజల సందర్శనార్ధం బుధవారం ఆయన ఇంటి వద్ద ఉంచారు. గూడ అంజయ్యను కడసారిగా చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు.
కవులు, రచయితలు, సాహితీవేత్తలు, గాయకులు, బాల్యమిత్రులు లింగాపూర్ చేరుకోవడంతోనే ఆ గ్రామం విషాద వదనాలతో బరువెక్కింది. పేదల జీవితాలను పాటలతో ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ధిక్కారస్వరాన్ని సంధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గూడ అంజయ్యతో అనుబంధాన్ని పలువురు సాహితీవేత్తలు గుర్తు చేసుకున్నారు.
గూడ అంజయ్య అంతిమ యాత్రలో ప్రజాయుద్ధనౌక గద్దర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, సినీ నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొని కంట తడిపెట్టారు. గూడ అంజయ్య తల్లి లక్ష్మమ్మ తన కొడుకు భౌతికదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్నవారందరిని కంటతడి పెట్టించింది.
అంజయ్యకు కుమారులు లేకపోవడంతో చిన్నకూతురు మమత చేత అంతిమ సంస్కారాలు జరిపించారు. ప్రత్యేక రథం ద్వారా గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించగా జోహార్ అంజయ్య.. గూడ అంజయ్య అమర్ రహే అన్న నినాదాలు మార్మోగాయి.