భుక్తికీ భాషకూ సంబంధం ఉంది: ఎన్ గోపీ
హైదరాబాద్: కవులు, కళాకారులపై చారిత్రక బాధ్యత ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎన్ గోపి అన్నారు. ఆదివారం టూరిజం ప్లాజాలో తెలంగాణ సాహిత్య కళావేదిక ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ - తెలుగు భాషను బతికించుకోవలసిన అవసరం ఉందన్నారు. భాషను బతికించుకోవాలని మాట్లాడితే సరిపోదని, జీవనాధారంతో భాషకు సంబంధం ఉంటుందని ఆయన అన్నారు. కొత్తరాష్ట్రంలో కవులు, కళాకారులపై చారిత్రక భాద్యత ఉందని, ఆ బాధ్యతను పరిపూర్తి చేసే దిశలో సాహిత్య కళా వేదిక ముందుకు నడుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాక సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సొంత అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం సాగిన పోరాట స్ఫూర్తిని కొత్త రాష్ట్రంలోనూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంద కవుల గానం కార్యక్రమాన్ని ప్రముఖ కవి నిఖిలేశ్వర్ ప్రారంభిస్తూ కవిదెప్పుడూ ప్రతిపక్షమే అన్నారు. స్మజనాత్మక రచయిత శాస్త్రీయ దృక్పథంతో తన అంతరాత్మను బహిర్గతం చేస్తాడని, ఆ సృజన నిరంతరం ప్రక్షల పక్షం వహిస్తుందని అన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు బీ నర్సింగరావు మాట్లాడుతూ - తెలంగాణ ఉద్యమానికి సాహిత్య, సాంస్కృతిక సంస్థలు ఎంతో దోహదపడ్డాయన్నారు. ఉద్యమ కాలంలో వెలువడిన కవిత్వాన్నంతా ఒక చోట చేర్చి ఆరు సంపుటాలుగా ప్రచురించనున్నట్లు తెలిపారు. కవి సమ్మేళనంలో ఓ సెషన్కు అధ్యక్షత వహించిన కాసుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ - బౌగోళిక తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో కవులు సందిగ్ధంలో ఉన్నారని, ఏ విధమైన పాత్ర పోషించాలనే విషయంపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని అన్నారు. ప్రతిభావంతంగా కవితలు రాయడానికి అభ్యాసం అవసరమని, కవిత్వంలో సాంద్రతను పెంచుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆశారాజు, అనిశెట్టి రజిత, వీఆర్ విద్యార్థి, జూకంటి జగన్నాథం తదితర వంద మంది కవులు పాల్గొని కవితాగానం చేశారు. కార్యక్రమంలో నాళేశ్వరం శంకరం, అమ్మంగి వేణుగోపాల్, ఏనుగు నర్సింహారెడ్డి, గంటా జలందర్ రెడ్డి పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో అందెశ్రీ, ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ఆట పాటలతో సభికులను అలరించారు.