పవన్ బ్రిలియంట్: పోలాండ్ రాయబారి ప్రశంస, భార్యతో కలిసి చర్చిలో ప్రార్థన
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పోలాండ్ అంబాసిడర్ అడమ్ బురాకోవస్కీ ఆదివారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో కలిశారు. పవన్ దంపతులు పోలాండ్ బృందానికి సాదర స్వాగతం పలికారు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పవన్ కొందరు పోలాండ్ వాసులతో భేటీ అయ్యారు.
పవన్ కళ్యాణ్కు ముద్రగడ సూచన, మారిన వ్యూహం
వారి ద్వారా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్న ఆడమ్ ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపించారు. ఆదివారం జనసేన కార్యాలయంలో ఆయనతో పాటు ఇరవై మంది పోలాండ్ విద్యార్థులు జనసేనానిని కలిశారు.
పాటపాడిన అంబాసిడర్, అన్నా-పవన్ చప్పట్లు
పవన్ కళ్యాణ్ దంపతులకు ఆడమ్ దంపతులు బహుమతులు ఇచ్చారు. పవన్ భార్య అన్నా కూడా వారికి బహుమతులు అందించారు.అనంతరం కొందరు ప్రత్యేక ఆహ్వానితులు, విదేశీ విద్యార్థులతో పవన్, ఆడమ్లు ముచ్చటించారు. ఈ సందర్భంగా తనకు హిందీ వచ్చని చెబుతూ ఆడమ్ మాట్లాడారు. అంతేకాదు ప్యార్ హువా అంటూ పాత బాలీవుడ్ పాటపాడి మైమరపించారు. దీంతో, పవన్ సహా అక్కడున్నవారంతా చప్పట్ల వర్షం కురిపించారు.
పవన్తో మాట్లాడా, బ్రిలియంట్ అని గుర్తించా
ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడారు. పవన్ చాలా తెలివైన వారని ప్రశంసించారు. భారతీయ సినీ రంగంలోని గొప్ప నటుల్లో పవన్ ఒకరన్నారు. పవన్తో మాట్లాడిన సందర్భంగా తాను ఒక విషయాన్ని గుర్తించానని, పవన్ ఒక బ్రిలియంట్ అని, అతని మనస్సులో ఎన్నో మంచి ఐడియాలు ఉన్నాయన్నారు.
సహకరిస్తానని పవన్ కళ్యాణ్
పోలండ్లో సినిమా షూటింగ్లు చేయాలని తాను పవన్ కళ్యాణ్ను కోరానని ఆయన చెప్పారు. అందుకు పవన్ సహకరించాలని కోరారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాను తప్పకుండా సహకరిస్తానని ఆయన చెప్పారు.
పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో కొందరు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై వీరు చర్చించారు. ఈ నెలాఖరులో పార్టీ సమన్వయకర్తల సమావేశం జరపాలని నిర్ణయించారని తెలుస్తోంది. అలాగే,మార్చి నెలలో పార్టీ ప్లీనరీని నిర్వహించే అంశంపై కూడా వారు చర్చించారని సమాచారం.
భార్య అన్నాతో కలిసి చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు
అంతకుముందు, పవన్ కళ్యాణ్ సికింద్రాబాదులోని సెయింట్ మెరీస్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటలకే ఆయన తన భార్య అన్నాలెజ్నేవాతో కలిసి చర్చికి వెళ్లారు.