మావోల ఘాతుకంతో ప్రజా ప్రతినిధులకు పోలీస్ అలెర్ట్ .. రాజకీయ వర్గాలకు టెన్షన్
ములుగు జిల్లాలో మావోయిస్టులు టిఆర్ఎస్ నాయకుడిని హతమార్చడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లు, దాడులకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్న పోలీసులు గత మూడు నెలలుగా సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ మావోయిస్టులు ములుగులో టిఆర్ఎస్ పార్టీ నాయకుడిని హతమార్చడం ఇప్పుడు పోలీసులకు సవాల్ విసిరింది.
ఏజెన్సీలో నిశ్శబ్ద యుద్ధం .. మావోయిస్ట్ ల కట్టడికి పోలీసుల త్రిముఖ వ్యూహం
ఏజెన్సీ ప్రాంత రాజకీయ నాయకులను అలెర్ట్ చేస్తున్న పోలీసులు
ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు మెరుపు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లుగా నిఘా వర్గాల సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, బయట తిరగొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్ నేపథ్యంలో చత్తీస్ గడ్ నుండి మకాం మార్చిన మావోయిస్టులు తెలంగాణలో తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు, చాపకింద నీరులా విస్తరిస్తున్న ట్లు గుర్తించిన పోలీసులు సరిహద్దు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
ఎన్ కౌంటర్లకు ప్రతీకారంగా మావోల చర్యలు
గత మూడు నెలలుగా ఇప్పటికి నాలుగుసార్లు కీలక భేటీ నిర్వహించిన పోలీసులు, డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల ఉనికిని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సరిహద్దు అటవీ ప్రాంతాలలో 6 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగానే ములుగు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వరరావు ను మావోయిస్టులు హతమార్చారు.
కోవర్టులు , ఇన్ఫార్మర్ లను టార్గెట్ చేస్తూ మావోల యాక్షన్ ... అలెర్ట్ అయిన పోలీసులు
ఇప్పటివరకు కోవర్టులు, ఇన్ఫార్మర్ల పేరుతో 12 మందిని మావోయిస్టులు హతమార్చారు. అంతేకాదు టిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాజాగా జరిగిన సంఘటనతో పోలీసులు మురుగు జిల్లాపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు. చత్తీస్ గడ్, తెలంగాణ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు కార్యకలాపాలను ప్రారంభించారన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు మాత్రమే కాకుండా, కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ములుగులో ఇంటికివెళ్ళి మరీ టీఆర్ఎస్ నేత హత్య .. భద్రత పెద్ద ప్రశ్న
పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నా, అడుగడుగునా జల్లెడ పడుతున్నా మావోయిస్టులు నేరుగా టీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్లి హత మార్చడం ఇప్పుడు పోలీసుల భద్రతా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టుల మెరుపుదాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా తాజాగా 8 మంది మావోయిస్టులను హతమార్చినందుకు ప్రతీకారంగా మావోయిస్టులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూకుడు చూపిస్తున్నారు .
Recommended Video
ఏజెన్సీలో ఉద్రిక్తత .. ప్రజా ప్రతినిధులకు పోలీసుల అలెర్ట్
ఇటు మావోలు, అటు పోలీసుల పోరుతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా ఘటనతో తెలంగాణ జిల్లాలలోనూ పోలీసు ఇన్ఫార్మర్స్ గా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్న వారిని ప్రజాకోర్టులు నిర్వహించి హతమార్చేందుకు మావోయిస్టులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో పలువురు భయాందోళనలో ఉన్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ,కీలక నాయకులను అప్రమత్తం చేస్తున్నారు. బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.