కోడెల మృతిపై మరిన్ని ఆధారాలు: చివరి ఫోన్ కాల్ ఎవరిది, ఎలా చనిపోయారు..?
హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కోడెల తనయుడు శివరాంను విచారించనున్నారు. కోడెల బలవన్మరణం వెనుక గల కారణాలు ఏమిటి, మానసికంగా వేధించారా, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను ఆయన నుంచి తెలుసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పన్నెండు మందిని విచారించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం కాల్ డేటా వివరాలు సేకరిస్తారు.
కోడెల ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు 12మంది విచారణ .. ఫోన్ కాల్స్ డేటా పరిశీలన
కోడెల ఫోన్లో మాట్లాడారా?
కోడెల తన ఆత్మహత్యకు ముందు 20 నిమిషాలకు పైగా ఫోన్ మాట్లాడారని వచ్చిన వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. దానిపై స్పష్టత రాలేదన్నారు. అసలు కోడెల సెల్ ఫోన్ దొరకలేదని, కాల్ డేటాను విశ్లేషించాల్సి ఉందని అంతకుముందు చెప్పారు. పూర్తి విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని చెబుతున్నారు.
వారిని విచారించాల్సి ఉంది?
కోడెల ఆత్మహత్య కేసును విచారిస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. మొబైల్ ఫోన్ దొరికిన తర్వాత కాల్ డేటా విశ్లేషిస్తామన్నారు. కోడెల మేనల్లుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు తమకు ఫ్యాక్స్ ద్వారా అందిందని, ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. అతని ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది వాంగ్మూలం సేకరించినట్లు తెలిపారు. కోడెల తనయుడు, సన్నిహితులను ప్రశ్నించాల్సి ఉందని, ఆత్మహత్యకు ముందు ఎవరితోనైనా మాట్లాడారనేది తెలియాల్సి ఉందన్నారు.
కేబుల్ వైర్తో ఆత్మహత్య, చివరి ఫోన్ కాల్ ఎవరికంటే?
ఇదిలా ఉండగా, కోడెల మృతిపై పోస్టుమార్టం ప్రాథమిక నివేదిను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు బుధవారం పోలీసులకు అందించారని తెలుస్తోంది. కోడెల కేబుల్ వైర్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అలాగే కోడెల తన చివరి ఫోన్ కాల్ను క్యాన్సర్ ఆసుపత్రి వైద్యురాలికి చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. ఇతర కాల్స్ వివరాలు కూడా సేకరిస్తున్నారు.
వివిధ కోణాల్లో దర్యాఫ్తు
కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ మేనల్లుడు సాయి సత్తెనపల్లిలో ఫిర్యాదు చేశారు. దీనిని బంజారాహిల్స్కు ఫ్యాక్స్ చేశారు. తనకు కోడెల పలుమార్లు ఫోన్ చేశారని, కొడుకు శివరాం మానసికంగా వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, కోడెల కూతురు విజయలక్ష్మి కూడా తన తండ్రిది అనుమానాస్పద మృతి అని, రాజకీయ కక్ష అని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు రెండు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.