కోడెల చివరి ఫోన్ కాల్ గన్మెన్కు, సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసిన పోలీసులు, కాల్ డేటా పైన దృష్టి సారించారు. ఆయన ఫోన్ను గుర్తించలేదు. కోడెల 16వ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య దాదాపు పది నుంచి పన్నెండు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. తెలిసినవారితో ఒకటి రెండు నిమిషాలతో మాట్లాడారని, చివరి ఫోన్ గన్మెన్ ఆదాబ్కు చేసి కేవలం 9 సెకన్ల పాటు మాట్లాడారని పోలీసులు గుర్తించారు.
కోడెల మృతిపై మరిన్ని ఆధారాలు: చివరి ఫోన్ కాల్ ఎవరిది, ఎలా చనిపోయారు..?
మరోసారి వారి విచారణ
కోడెల కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో పని చేసేవారిని పోలీసులు మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. కోడెల ఇంట్లోని కొన్ని వస్తువులను సీజ్ చేసిన పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత కేసు మరింత ముందుకు కదులుతుంది. కోడెల గదిలో కొన్ని టాబ్లెట్స్ కూడా గుర్తించారని తెలుస్తోంది. అక్కడ లభ్యమైన మెడిసిన్స్, మందు చీటీలును సీజ్ చేసి, పరీక్షల నిమిత్తం పంపించారు.
సీబీఐ విచారణకు డిమాండ్
ఇదిలా ఉండగా చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కోడెలపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపించారు. కోడెలపై సెక్షన్ 409, సెక్షన్ 411 కింద కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని, రూ.1 లక్ష విలువ చేసే ఫర్నీచర్ కోసం ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారని, ఆయన కుటుంబంపై గత మూడు నెల్లలో 18 చిల్లర కేసులు పెట్టారని, కోడెల లేఖ రాసినా స్పందించని అసెంబ్లీ కార్యదర్శిని శిక్షించాలని, ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కెన్యాలో ఉన్న కొడుకు ఎలా కొట్టాడు?
కోడెల చనిపోయే సమయానికి ఆయన తనయుడు శివరాం కెన్యాలో ఉన్నారని, అలాంటప్పుడు అతను కొట్టడం వల్ల చనిపోయారని సాక్షి పత్రికలో దుష్ప్రచారం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని తొలుత సాక్షిలో వచ్చిందని, ఆ తర్వాత ఆత్మహత్య అన్నారని, అనంతరం హత్య అని తేలిందని గుర్తు చేశారు. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి వివేకా ఇంట్లో రక్తపు మరకలు తుడిచేశారని, ఆయన మృతదేహాన్ని పడక గది నుంచి బాత్రూంలోకి తీసుకు వెళ్లారని, జగన్ మామ గంగిరెడ్డి ఆసుపత్రిలో భౌతికకాయానికి బ్యాండేజీ కట్టారని, అలాంటప్పుడు వీరందరినీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. ఇక్కడి పోలీసులతో కాకుండా సీబీఐతో కోడెల మృతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వివేకానంద హత్య కేసులో వారిని తాము ఇలా వేధించామా అని ప్రశ్నిస్తున్నారు. కానీ జైల్లో ఉండి వచ్చిన వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.
సీబీఐ విచారణ జరుగుతుందా?
కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కూడా టీడీపీ నేతలు కలిశారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీపై ఫిర్యాదులు అందాయని, కోడెల మృతిపై అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరిపిస్తామని చెప్పారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కోడెల మృతి తర్వాత టీడీపీ నేతలు మొదటి నుంచి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సానుకూలంగా కనిపించాయి.