అమావాస్య రోజు యువతి నరబలికి ప్లాన్.. కనకవర్షం కురుస్తుందన్న మూఢనమ్మకం.. భగ్నం చేసిన పోలీసులు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం వెలుగుచూసింది. క్షుద్ర పూజల పేరుతో అమాయక యువతిని నరబలి ఇచ్చేందుకు సిద్దపడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. క్షుద్ర పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని... స్థానికుడైన ఓ వ్యక్తికి అతని స్నేహితులు నమ్మబలికారు. ఇందుకోసం ఓ అవివాహిత యువతిని బలి ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ జరగ్గా... చివరి నిమిషంలో ప్లాన్ బెడిసి కొట్టింది. విషయం పోలీసులకు తెలియడంతో కుట్ర భగ్నమైంది.
పెద్దపల్లిలో వివాహితపై గ్యాంగ్ రేప్.. ఇటుకబట్టీలో దారుణం... యజమానులే కీచకులు...?
అసలేం జరిగింది...
పెద్దపల్లి పోలీసుల కథనం ప్రకారం... జిల్లా కేంద్రానికి చెందిన బండ తిరుపతికి ధనవంతుడిగా స్థానికుల్లో గుర్తింపు ఉంది. బాగానే ఆస్తిపాస్తులు సంపాదించాడు. తిరుపతి నుంచి డబ్బులు గుంజేందుకు అతని స్నేహితుడు ఆరేపల్లి రాజేందర్ ఓ స్కెచ్ వేశాడు. క్షుద్రపూజలు చేస్తే ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయని తిరుపతిని నమ్మించాడు. మహారాష్ట్రకు చెందిన బాబాలకు చాలా మహిమలు ఉంటాయని... వారిని తీసుకొచ్చి పూజలు చేయిస్తానని చెప్పాడు. పూజలో నరబలి కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. అయితే ఇందుకోసం భారీగా ఖర్చవుతుందని చెప్పాడు. రాజేందర్ మాటలు నమ్మిన తిరుపతి అందుకు అంగీకరించాడు.
కనకవర్షం కురుస్తుందన్న బాబా...
చందపల్లిలోని తన స్నేహితులైన ఆర్ఎంపీ ఉప్పు కుమార్, రైల్వే ఉద్యోగి మంతెన శ్రీనివాస్లను కలుసుకుని రాజేందర్ తన స్కెచ్ గురించి వివరించాడు. తనకు సహకరిస్తే మీకూ కొంత డబ్బు ఇస్తానని నమ్మించాడు. దీంతో ఈ ముగ్గురు,తిరుపతి కలిసి క్షుద్రపూజల ఏర్పాట్లకు సిద్దమయ్యారు. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన బాబా రమేశ్ చావ్లాదేవ్ను సంప్రదించారు. పూజ చేసేందుకు ఒప్పుకున్న ఆ బాబా... పూజలో కూర్చోబెట్టేందుకు ఇద్దరు మహిళలు, ఒక అవివాహిత యువతి కావాలని చెప్పాడు. అలా అయితేనే కనకవర్షం కురుస్తుందని చెప్పాడు.
ఆ ముగ్గురు మహిళలతో సంప్రదింపులు...
బాబా సూచనలతో ఆర్ఎంపీ కుమార్ చందపల్లికి చెందిన తొగరి సరిత,భూతం మల్లమ్మ అనే ఇద్దరు మహిళలను సంప్రదించాడు. అమావాస్య రోజు తమ స్నేహితుడి ఇంట్లో పూజ ఉందని... అందులో పాల్గొంటే రూ.2లక్షలు చొప్పున ఇస్తానని నమ్మించాడు. అంతేకాదు,పెళ్లి కాని యువతిని తీసుకొస్తే రూ.20లక్షలతో పాటు బంగారం ఇస్తానన్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన ఆర్కుటి సరిత అనే వివాహితను ఆ ఇద్దరు మహిళలు సంప్రదించారు. అమావాస్య రోజు తమతో పాటు మీ కూతురుని పంపిస్తే రూ.20లక్షలు,బంగారం ఇస్తామని సరితతో చెప్పారు.
మొదట అంగీకరించిన సరిత...
భారీగా డబ్బు ఇస్తామని ఆశజూపడంతో సరిత అందుకు ఒప్పుకుంది. 20 ఏళ్ల తన కూతురిని ఆరోజు పూజకు పంపిస్తానని చెప్పింది. అయితే అంతకుముందే తనకు డబ్బు కావాలని షరతు పెట్టింది. అయితే ఆ ఇద్దరు మహిళలు,ఆర్ఎంపీ మాత్రం పూజ తర్వాతే డబ్బు ఇస్తామని చెప్పారు. ఇదే విషయంపై ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. ఆర్ఎంపీ కుమార్ నుంచి రోజురోజుకు ఒత్తిడి ఎక్కువవడంతో సరిత తన భర్తకు ఇదంతా వివరించింది. అనుమానం వచ్చిన అతను కుమార్ను గట్టిగా నిలదీశాడు. దీంతో ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని కుమార్ వారిని బెదిరించడం మొదలుపెట్టాడు.
కుట్రను భగ్నం చేసిన పోలీసులు
ప్రాణ భయంతో ఆర్కుటి సరిత,ఆమె భర్త ఈ నెల 8న పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి డీసీపీ రవీందర్,ఎస్సై రాజేష్ పక్కా ప్రణాళికతో నిందితులను బుధవారం(ఫిబ్రవరి 10) అరెస్ట్ చేశారు.తొగరి సరిత, భూతం మల్లమ్మ పరారీలో ఉన్నట్లు చెప్పారు. క్షుద్రపూజల్లో నరబలి కోసమే ఆర్కుటి సరిత కుమార్తెను పంపించాలని నిందితులు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.