ప్రియుడికి తెలియదు!: భర్తను చంపిన స్వాతి కేసులో ట్విస్ట్, ఏ క్షణమైనా రాజేష్ అరెస్ట్
Recommended Video
హైదరాబాద్/నాగర్ కర్నూలు: ప్రియుడి మాయలో పడి ప్రేమించిన భర్తను దారుణంగా హత్య చేసిన స్వాతి కేసులో ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. స్వాతిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఆమెను అరెస్టు చేసిన విషయం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ప్రియుడు రాజేష్కు తెలియదు.
ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్కర్నూల్ ఫిజియో థెరపిస్ట్ రాజేష్కు ఇప్పటివరకూ జరిగిన ఉదంతం ఏమీ తెలియదని చెబుతున్నారు. ఇప్పటికీ సుధాకర్ రెడ్డి పేరిటే అతను వైద్యం చేయించుకుంటున్నాడని, డాక్టర్లు కూడా తమ సూచన మేరకు ఆయన్ను సుధాకర్గానే పిలుస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
ఒంటరితనం, ప్రియుడిపై వ్యామోహం: స్వాతి భర్తను చంపడానికి కారణాలివే!
స్వాతి అరెస్ట్ విషయం తెలియదు
స్వాతి అరెస్టయిన విషయం రాజేష్కు తెలియదని, అయితే, గత రెండు రోజులుగా ఆమె ఆసుపత్రిలో కనిపించక పోవడంతో రాజేష్కు అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు ఒకసారి ఆయన నోటి వెంట స్వాతి పేరు వచ్చిన తర్వాతే విషయం చెబుదామని వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
అందుకే చెప్పడం లేదు
కేసులో రాజేష్ ఏ1 కావడం, ముఖానికి గాయాలు మానడంతో సోమవారం సాయంత్రం లేదా రేపు ఉదయం రాజేష్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతనికి ఆసుపత్రి బెడ్పై ఉన్నప్పుడే విషయం తెలిస్తే ముందు జాగ్రత్త పడతాడని, దాని ఫలితంగా కేసు విచారణ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉన్నందునే చెప్పడం లేదని తెలుస్తోంది. అతనిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు ఆసుపత్రి వద్ద ఉన్నారు. అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి అదుపులోకి తీసుకోనున్నారు.
స్వాతిని విచారిస్తున్న పోలీసులు
స్వాతిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో తవ్వేకొద్ది ఎన్నో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రియుడితో కలిసి తన భర్తను ఎలా చంపామనే విషయాన్ని ఆమె పోలీసుల ఎదుట పూసగుచ్చి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
రేపు పిల్లలను ఏమైనా చేస్తుందేమో
స్వాతి భర్త సుధాకర్ చాలా మంచివాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ఊళ్లో అందరితో చాలా కలుపుగోలుగా ఉంటాడని చెప్పారు. స్వాతి భర్తనే ఇలా దారుణంగా హత్య చేసింది అంటే రేపు పిల్లలను కూడా ఏమైనా చేస్తుందేమో అన్నారు.
సర్వీసులో ఇలాంటి ట్విస్టులున్న కేసు చూడలేదని
కాగా, నాగర్ కర్నూలు జిల్లాలో స్వాతి చేసిన పనులు చూసిన పోలీసు ఉన్నతాధికారులు తమ సర్వీసులో ఇన్ని ట్విస్టులు ఉన్న కేసును చూడలేదని అంటున్నారు. ఈ కేసులో నిందితురాలు స్వాతిని మీడియా ముందు చూపిన సమయంలో నాగర్ కర్నూలు పోలీసులు మీడియాతో మాట్లాడారు.
స్వాతి నిరూపించింది
ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని, సమాజం మారుతున్న ధోరణికి ఇవి నిదర్శనం అని, నేరప్రవృత్తిలో స్త్రీ, పురుషులు అన్న తేడాలు ఏమీ లేవని స్వాతి మరోసారి నిరూపించిందని పోలీసులు వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాజేష్ మొదటి నిందితుడని, స్వాతి రెండో నిందితురాలని చెప్పారు.