మిస్టరీ వీడింది: ఆ దొంగ అన్వేష్?, టెక్కీలను ఇలా బురిడీ కొట్టించాడు
హైదరాబాద్: రూమ్మేట్గా చేరుతానంటూ వచ్చి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి డబ్బులు కాజేసిన యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఫ్లాట్లో ఉన్నది కొద్దిసేపే అయినా.. అంతలోనే ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఎలా బురిడీ కొట్టించాడో పోలీసులు వివరించారు. ఏమాత్రం అనుమానం రాకుండా అత్యంత చాకచక్యంగా దొంగతనం వెలగబెట్టిన ఆ యువకుడిని కొనేరు అన్వేష్(28)గా గుర్తించారు.
వీడు మామూలోడు కాదు: టెక్కీ డబ్బు దోచేశాడు?, కానీ ఎలా అన్నదే మిస్టరీ..
ఎవరీ అన్వేష్?:
నిందితుడిని వరంగల్ జిల్లా ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన కొనేరు అన్వేష్(28)గా గుర్తించాను. ఇతనో బీటెక్ డ్రాపౌట్. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో ఈవెంట్ మేనేజర్గా చేశాడు. కానీ కొన్నాళ్లకే అది మానేసి ఖాళీగా ఉంటున్నాడు.
డబ్బుకోసం అడ్డదారులు:
అన్వేష్ సోదరుడు మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీంతో అతనితో కలిసి నిజాంపేటలోని శ్రీనివాస లేక్వ్యూ విలాస్లో నివాసముంటున్నాడు. ఈవెంట్ మేనేజర్గా అవకాశాలు లేకపోవడంతో డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు అన్వేష్. ఆ క్రమంలో హర్ష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెబిట్ కార్డు దొంగిలించాడు.
రూమ్ మేట్గా చేరుతానని:
ఇటీవలే తమ స్నేహితుడు ఫ్లాట్ ఖాళీ చేయడంతో.. కొండాపూర్ కి చెందిన హర్ష్, వన్ష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రూమ్ మేట్ కావాలని 'ఫేస్బుక్లో ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్స్మేట్స్' గ్రూప్లో ఒక ప్రకటన పోస్టు చేశారు.
అది చూసి అన్వేష్ వారిని సంప్రదించడం.. ఫ్లాట్ కి వెళ్లి అద్దె వివరాలు మాట్లాడి వారిని ఒప్పించడం జరిగిపోయాయి. ఈ క్రమంలోనే హర్ష్కి తెలియకుండా అతని డెబిట్ కార్డు కూడా దొంగిలించాడు అన్వేష్.
డెబిట్ కార్డు ఇలా దొంగిలించాడు:
తను కొత్త ఫ్లాట్ కి రాబోతున్న విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పాలని అన్వేష్.. హర్ష్, వన్ష్ లతో చెప్పాడు. తన సెల్ ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో.. హర్ష్ మొబైల్ తీసుకున్నాడు. అంతకన్నా ముందే.. వాష్ రూమ్ వెళ్తానని చెప్పి ఒక బెడ్ రూమ్ లోకి వెళ్లిన అన్వేష్.. ఆ గదిలో ఒక సెల్ఫ్ లో ఉన్న హర్ష్ డెబిట్ కార్డు దొంగిలించాడు. ఆపై ఏమాత్రం అనుమానం రాకుండా గది నుంచి బయటకొచ్చాడు.
తల్లికి ఫోన్ చేయాలని:
కొత్త ఫ్లాట్ కి వచ్చిన విషయం తల్లికి ఫోన్ చేసి చెబుతానని చెప్పి.. హర్ష్ సెల్ ఫోన్ తీసుకున్నాడు అన్వేష్. సిగ్నల్ రావట్లేదని కాస్త దూరం వెళ్లాడు. తల్లితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ.. బ్యాంకుకు ఫోన్ చేశాడు. డెబిట్ కార్డు పిన్ మార్చుకోవాలనుకుంటున్నానని సిబ్బందికి తెలిపాడు. అది రిజిస్టర్ నంబర్ కావడంతో.. వారు కూడా చకచకా ఓటీపీ పంపించేయడం.. అన్వేష్ పిన్ నంబర్ మార్చేయడం జరిగిపోయాయి.
ఇప్పటికీ మూడు దొంతనాలు:
ఆ వెంటనే సమీపంలోని ఓ ఏటీఎం వద్దకు వెళ్లి అందులోని డబ్బు దొంగిలించాడు.ఫిబ్రవరిలో ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ మాదాపూర్, మియాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మూడు డెబిట్ కార్డులను అతను దొంగిలించినట్టు తెలిపారు. దొంగిలించిన కార్డుల ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ.3,71,900 కాజేసినట్టు చెప్పారు. విచారణలో నేరం అంగీకరించినట్టు చెప్పారు.