భార్య, బంధువులే ముఠా, 20ఏళ్లుగా చోరీలు: 100కేసుల్లో ‘గజదొంగ’ అరెస్ట్
గద్వాల: హత్య కేసు సహా వంద చోరీ కేసుల్లో నిందితుడైన అంతర్రాష్ట దొంగను గద్వాల పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు తన భార్య, బంధువులతో కలిసి అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరస చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
గురువారం గద్వాల అదనపు ఎస్పీ భాస్కర్ ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీరాంపురం కాలనీకి చెందిన బోయ సోమశేఖర్ తన భార్య ఉసేన్బీ, అత్త ఖాజాబీ, మరదలు రసూల్బీలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
సోమశేఖర్ ముంబైలోని ఓ చేపల మార్కెట్లో రోజు కూలీగా పనిచేసేవాడు. 1995 నుంచి ఇతడిపై దొంగతనం కేసులున్నాయి. ఈ ముఠా తాజాగా, డిసెంబర్ 9న గద్వాల కొత్త హౌసింగ్బోర్డు కాలనీలో తసిన్, అల్తాఫ్త్ ల ఇంట్లో చోరీకి పాల్పడింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో దొంగతనం కేసులున్నాయని తెలిపారు.
బుధవారం సాయంత్రం మళ్లీ దొంగతనాలు చేసేందుకు గద్వాలకు రైళ్లో తిరిగి వస్తుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 47 తులాల బంగారు ఆభరణాలు, 1.65 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.