గుట్టు రట్టు: హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా.. పబ్లు, ఈవెంట్లే టార్గెట్!
హైదరాబాద్: మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని పబ్స్, బార్స్, ఈవెంట్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), సనత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.3 లక్షల విలువచేసే కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదే గ్యాంగ్..:
హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన రఫత్ మెహదీ అలీఖాన్(27) అమీర్పేటలోని ఓ ఈవెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాడు. ముంబైలో డ్రగ్స్ విక్రయించే మహ్మద్ అఫ్తాబ్ ఆలం అలియాస్ షాలి, పప్పు(38), మహ్మద్ షమీమ్ ఆలం(40)లతో ఇతనికి పరిచయం ఉంది. ఆ పరిచయంతో.. వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు.
ముంబై గ్యాంగ్ తో సంబంధాలు..
ముంబైలో ఉండే పప్పు, ఆలంలు పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. ముంబైకే చెందిన ఇంతియాజ్ అలీ ఖురేషీ(42)తో కలిసి వీరు డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టారు. ముంబై పోర్ట్ పరిసర ప్రాంతాల్లోని నైజీరియన్ల నుంచి వీరు డ్రగ్స్ కొనుగోలు చేస్తుంటారు. ముంబైలోని పబ్స్, బార్స్, ఈవెంట్లకు వీటిని సరఫరా చేస్తుంటారు.
గ్రాము రూ.10వేలు:
హైదరాబాద్కి చెందిన రఫత్ మోహదీ ముంబైకి చెందిన ఆ ముఠాతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్లను గ్రాము రూ.2500 నుంచి రూ.5 వేలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.10 వేల చొప్పున అమ్ముతున్నాడు.
భరత్నగర్లో అరెస్ట్:
రఫత్ మోహదీ డ్రగ్స్ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందడంతో అతనిపై నిఘా పెట్టారు. ఆదివారం సాయంత్రం నిందితుడు భరత్నగర్ సమీపంలోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి పట్టుకున్నారు.
మొత్తం నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 31 ప్యాకెట్ల కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్లను, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టడీలో నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.