ఫోన్ చేస్తే ఆటోలో యువతుల సప్లై.. హైదరాబాద్లో వ్యభిచార దందా బట్టబయలు..
లాక్ డౌన్ వేళ హైదరాబాద్లో ఓ వ్యభిచార దందా బయటపడింది. లాక్ డౌన్లో చాలామంది ఉద్యోగ,ఉపాధి కోల్పోయి కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో.. పేదింటి అమ్మాయిలను ఆకర్షించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ముంబై నుంచి అమ్మాయిలను రప్పించి హైదరాబాద్లో దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేసి ఈ వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు.
ఇలా ప్లాన్ చేశారు..
పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్కి చెందిన అబ్దుల్ మిస్కిన్(30) ఆయన భార్య లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమకు తెలిసిన షేక్ ముస్తాక్(27) అనే ఆటో డ్రైవర్తో కలిసి దీనిపై చర్చించారు. చివరకు ముగ్గురు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ముంబై నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయించాలని నిర్ణయించారు. తద్వారా డబ్బులు సంపాదించవచ్చునని,కష్టాల నుంచి గట్టెక్కవచ్చునని ప్లాన్ చేశారు. ఇందుకోసం ముంబైలో కొంతమందిని సంప్రదించి డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం.
పాతబస్తీ,రాజేంద్రనగర్లో..
అనుకున్నట్టుగానే ముంబై నుంచి ఇద్దరు యువతులను హైదరాబాద్కి రప్పించారు. పాతబస్తీ,రాజేంద్ర నగర్ సర్కిల్లో విటులను ఆకర్షిస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. విటులతో షేక్ ముష్తాక్ కాంటాక్ట్లో ఉండేవాడు. వారిని నుంచి ఫోన్ కాల్స్ రాగానే యువతులను తన ఆటోలో ఎక్కించుకుని ఆ ప్రదేశానికి వెళ్లేవాడు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం ఈ ముఠా తమ అడ్డాను శాస్త్రిపురం డివిజన్లోని కింగ్స్ కాలనీకి మార్చింది.
Recommended Video
ఇలా బట్టబయలు...
కింగ్స్ కాలనీలోని ఓ ఇంట్లో దిగిన ఈ ముఠా అక్కడే వ్యభిచార కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇటీవల ఆ ఇంటికి విటుల రాకపోకలను స్థానికులు గమనించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా.. పక్కా ప్లాన్తో అర్ధరాత్రి పూట ఆ ఇంటిపై దాడులు చేశారు. ఇద్దరు యువతులతో పాటు నగరానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతులను రెస్క్యూ హోమ్కు తరలించారు. దాడుల సమయంలో నిర్వాహకులు అక్కడ లేరని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.