వీడు వెరైటీ దొంగ.. రాత్రి పడుకుని.. చోరీలకు కొత్త భాష్యం..!
హైదరాబాద్ : దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి. చోరాగ్రేసరులు సాధారణంగా ఏ సమయాల్లో రెచ్చిపోతారు. ఇలాంటి ప్రశ్నలు ఏ చిన్న పిల్లోడిని అడిగినా.. ఠక్కుమని రాత్రి అని సమాధానం చెబుతారు. అందరకీ తెలిసింది కూడా అదే. కానీ తాజాగా పోలీసులకు చిక్కిన దొంగ స్టైల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. నగరమంతా నిద్రపోతున్న వేళ దొంగతనాలు చేయకుండా వేళ గాని వేళలో చోరీలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. చోరీలకు కొత్త భాష్యం చెప్పిన కొత్త రకం దొంగోడి తీరు చూసి పోలీసులే విస్తుపోయిన సందర్భం ఎదురైంది.
విచిత్ర దొంగ.. రాత్రి పడుకుని.. తెల్లారి..!
శనివారం నాడు హైదరాబాద్ పోలీసులు ఓ వింత దొంగను పట్టుకున్నారు. వింత అంటే మామూలు వింత కాదు. అనువుగాని సమయాల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారు నేరగాళ్లు. సరిగ్గా ఈ దొంగ విషయంలో కూడా అదే జరిగింది. తాళం వేయని ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం.. ఫిర్యాదు చేయడం ఇక ఈజీ..!
మంచిర్యాల స్వస్థలం.. నగరంలో దొంగతనం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాకు చెందిన 29 సంవత్సరాల చేగుంట భీమ్రావు.. ఇదివరకు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రైవేట్ సంస్థలకు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అయితే ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ దొంగలా మారాడు. పని చేయకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో చోరీలకు స్కెచ్ వేశాడు. అదను కోసం చూసి ఇళ్లకు కన్నాలు వేయడం ప్రారంభించాడు. అయితే సాధారణంగా దొంగలు రాత్రి పూట చోరీలు చేసేందుకు సిద్ధమవుతారు. ఈ భీమ్రావు మాత్రం ఉదయం పూటే ఇళ్లల్లో దూరుతాడు.
సాధారణంగా కొందరు గృహిణులు భర్త ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్లాక.. కాలక్షేపం కోసం తమ ఇంటికి గొలుసు మాత్రమే పెట్టేసి పక్కింట్లోకి వెళ్లి ముచ్చట్లు పెడుతుంటారు. అదే ఈ దొంగకు కలిసొచ్చింది. అందుకే ఇలాంటి ఇళ్లను టార్గెట్గా పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. రాత్రిపూట దొంగతనాలు చేస్తే ఏం వెరైటీ అనుకున్నాడో.. ఈ పద్దతే ఈజీగా ఉందనుకున్నాడో ఏమోగానీ ఉదయం పూట చోరీలకు మరిగాడు.
అలా దూరి.. ఇలా పారిపోయి..!
గత నెల 21వ తేదీన మార్తాండ నగర్ ఏరియాలో ఇలాగే ఓ ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డాడు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదుతో ఉడాయించాడు. ఆ క్రమంలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో చివరకు పోలీసుల వలకు చిక్కాడు.
ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి 20 తులాల బంగారు నగలు.. 10 తులాల వెండి ఆభరణాలు.. 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు దొంగను రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన మియాపూర్ పోలీసు బృందాన్ని డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించి రివార్డులు అందించారు.