ప్రేమన్నాడు .. పెళ్లన్నాడు.. ఆ విద్యార్థిని ప్రాణం తీసి పాతిపెట్టాడు
చెన్నై తారాపురంలో విద్యార్ధిని కిడ్నాప్, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ విద్యార్ధినిది కిడ్నాప్ కాదని, ఇష్టపూర్వకంగానే వెళ్లిందని, అయితే ఆ తర్వాత జరిగినది మాత్రం ఆమె ఊహించని పరిణామమని పోలీసులు చెబుతున్నారు. ఇక చెన్నై తారాపురం లోని విద్యార్థిని కిడ్నాప్ కేసులో షాకింగ్ నిజాలను బయటపెట్టిన పోలీసులు అందరూ అవాక్కయ్యే విషయాలను చెప్పారు.
చెన్నై తారాపురంలో విద్యార్ధిని కిడ్నాప్ కేసులో షాకింగ్ నిజాలు
దిండుక్కల్ జిల్లా వేడచందూర్కు చెందిన తమిళరసి, ముత్తరసి అక్కాచెల్లెళ్లు.. అక్కకి వివాహం జరిగి తిరుపూర్లో నివసిస్తుంది. తన అక్కను చూసేందుకు ముత్తరసి తరచుగా తిరుపూర్ వెళ్లేది. ఇక ఈ క్రమంలో అత్తుక్కాల్ పుదూర్కి చెందిన భరత్ అనే డ్రైవర్ తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వేడచందూర్కి వెళ్లిన భరత్, ముత్తరసిని తనతో పాటు తీసుకు వెళ్ళాడు. ఐదు నెలల పాటు తనతో పాటే ఉంచుకున్నాడు. ఇక చెల్లి ఎక్కడికి వెళ్లిందో అర్థం కానీ అక్క తమిళరసి తన చెల్లి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు ముత్తరసి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మీద అనుమానం వచ్చింది. దీంతో భరత్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారిస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రాణం తీసి పాతేసిన ప్రియుడు
తాను ముత్తరసిని పెళ్ళి చేసుకోవడానికి తీసుకువెళ్లానని చెప్పిన భరత్ ఇక తమ మధ్య కొద్దిరోజుల్లోనే అభిప్రాయభేదాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ రోజు భరత్.. ముత్తరసిని నిర్జన ప్రదేశంలోకి తీసుకుని వెళ్లగా అక్కడ మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు గా తెలిపాడు . ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన భరత్.. ఆమెను బలంగా కొట్టాడు. దీంతో ముత్తరసి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇక ఏం చేయాలో పాలు పోక అక్కడి నుంచి ఆత్తుక్కాల్పుదూర్లోని తన ఇంటికి వచ్చిన భరత్ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో వారు హత్య విషయం బయటకు పొక్కకుండా మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలో గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టారు.
మరో అమ్మాయిని పెళ్ళాడిన ఘనుడు .. పోలీస్ విచారణ .. అరెస్ట్
అనంతరం భరత్కి వీరాట్చి మంగళమ్కి చెందిన మరో యువతితో వివాహం నిశ్చయించారు. ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు శవం పాతిపెట్టడం మంచిది కాదని భావించిన వారు మృతదేహాన్ని మళ్లీ తవ్వి బయటకి తీశారు. అప్పటికే ముత్తరసి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్న పొట్టల్కాడుకి తీసుకెళ్లి ఆమె శవాన్ని కాల్చేశారు. ఇక ఆ తరువాత భరత్కి వివాహం చేశారు. దీంతో ముత్తరసి కథ కంచికి చేరింది. పోలీసుల విచారణలో ఈ షాకింగ్ విషయాలు చెప్పిన భరత్, అతనికి సహకరించిన ఇద్దరు బంధువులను అరెస్ట్ చేసి వేడచందూర్కు తరలించారు. మొత్తానికి ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చివరకు ముత్తరసి ప్రాణాలు తీసి పాతిపెట్టాడు.