యువత వేగానికి పోలీసుల చెక్..! నేడు ప్రధాన ఫ్లైఓవర్ల మూసివేత..!!
హైదరాబాద్ : కొత్త సంవత్సరం జోష్ లో స్నేహితులను బైక్ పై ఎక్కించుకుని రివ్వున తేలిపోదాం అనుకునే యువతకు నగర పోలీసులు బ్రేకులు వేయబోతున్నారు. నూతన సంవత్సర హాంగోవర్ లో కాస్త దురుసుగా బైకులు, కార్లు నడిపై యువతను కట్టడి చేయాలనుకుంటున్నారు పోలీసులు. నగరంలో అతి వేగాన్ని నియంత్రించే పోలీసులు నేడు ప్రత్యేకించి మొత్తానికే ఆంక్షలు విధించబోతున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లను మూసేవేసి నగర యువత జోష్ చెక్ పెట్టబోతున్నారు నగర పోలీసులు.
నూతన సంవత్సరవేళ ప్రమాదాల నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విచ్ఛలవిడిగా మద్యం తాగి ప్రయాణించి.. రేసులకు పాల్పడేవారిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. 31వ తేదీ రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు హైదరాబాద్లోని అన్ని ఫ్లైఓవర్లపై రాకపోకలు నిషేధించారు. ఆ సమయంలో ఫ్లైఓవర్లకు అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేస్తారు.
అంబులెన్సులను మినహా మరే ఇతర వాహనాలను కూడా అనుమతించరు. అయితే.. బేగంపేట ఫ్లైఓవర్పై మాత్రం ఈ ఆంక్షలు ఉండవు. ఈ వంతెన మార్గమే ప్రధాన రహదారి కావడంతో ఆ ఒక్క ఫ్లైఓవర్నే తెరిచి ఉండాలని నిర్ణయించారు. ఇక యువత నూతన సంవత్సర జోష్ తో మేఘాలలో తేలిపోదామనుకుంటే మాత్రం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే..!!