హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ కు రూ.27,165 జరిమానా వేసిన ట్రాఫిక్ పోలీసులు ... ఎందుకో తెలుసా ?
కొత్త మోటర్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ట్రాఫిక్ చలానాల మోత మోగుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రాలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లో భాగంగా విధిస్తున్న జరిమానా లపై ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది.
ఇక గుజరాత్ రాష్ట్రం ప్రజల నుండి వ్యక్తం అవుతున్న నిరసన నేపధ్యంలో చలానాలు తగ్గించింది . పశ్చిమ బెంగాల్ మాత్రం కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేసేది లేదని తేల్చిచెప్పింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ చలానాలు వసూలుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, తాజాగా హైదరాబాద్లో ఓ క్యాబ్ డ్రైవర్కు రూ.27,165 జరిమానా విధించడం ఆశ్చర్యానికి గురి చేసింది.
గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా ఓ క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు అతని నుండి పెద్ద మొత్తంలో జరిమానా వసూలు చేశారు. మొత్తం ఆ వాహనం మీద 119 పెండింగ్ ట్రాఫిక్ చలానాలను గుర్తించిన పోలీసులు అందుకుగాను 27,165 జరిమానా విధించారు . నార్సింగి ప్రాంతానికి చెందిన రమేష్ అనే క్యాబ్ డ్రైవర్ నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. కొంత కాలంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రమేష్పై 119 ట్రాఫిక్ చలాన్లు పెండింగో ఉన్నాయి. ఇప్పటి వరకు రమేష్ వాటిని చెల్లించలేదు.. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన అతని నుండి ముక్కు పిండి మరీ ఇప్పటివరకు పెండింగ్ ఉన్న ఫైన్ లు అన్నింటిని వసూలు చేశారు.