తుపాకీ మిస్పైర్... కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా!
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మంగళవారం తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గాంధీ ఆసుపత్రిలోని జైలు వార్డు వద్ద సాయినాథ్ అనే కానిస్టేబుల్ తన తుపాకీని శుభ్రం చేసుకుంటుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో తుపాకి నుంచి వెలువడిన తూటా అతడి ఛాతీలోకి దూసుకుపోవడంతో సాయినాథ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
తుపాకీ మిస్ఫైర్ గురించి తెలియగానే పోలీసు శాఖ ఉన్నతాధికారులు గాంధీ ఆసుపత్రికి వచ్చి కానిస్టేబుల్ సాయినాథ్ను పరామర్శించారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సాయినాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ తుపాకీ మిస్ఫైర్ పొరపాటును జరిగిందా? లేక కానిస్టేబుల్ సాయినాథ్ ఆత్మహత్మకుగాని ప్రయత్నించాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.