ఆ మాటలు నమ్మే బలైపోయింది..: వివాహిత హత్య వెనుక మిస్టరీ..
హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురం బల్దియా పార్కులో వివాహిత హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. పరిచయస్తుడే ఆమెను హతమార్చి పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు.ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకోవడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. శాస్త్రిపురంలో నివసించే పద్మకు విష్ణు అనే వ్యక్తితో కొన్ని నెలలుగా పరిచయం ఉంది. ఏదైనా పనిలో పెట్టించాలని పద్మ విష్ణును కోరగా.. ఓ ఇంట్లో ఆమెను పనికి కుదిర్చాడు. ఓరోజు పద్మకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడి విష్ణును అడిగింది. రూ.10వేలు ఉంటే సర్దాలని తర్వాత అప్పు తీరుస్తానని చెప్పింది.
తన వద్ద డబ్బులకు కొదువలేదని ఎప్పుడూ చెప్పే విష్ణు.. పద్మ అలా అడగడంతో అయోమయంలో పడిపోయాడు. ఇడ్లీ బండి నడిపే విష్ణు వద్ద వాస్తవానికి అంతగా డబ్బు లేకపోయినా.. ఉన్నట్టు నటించేవాడు. ఆ మాటలు నమ్మే పద్మ అతన్ని డబ్బు అడిగింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని విష్ణు.. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై పద్మను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 30వ తేదీ రాత్రి నిర్మానుష్యంగా ఉన్న పార్కు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆపై బస్తీకి వెళ్లి మద్యం, మరో డబ్బాలో కిరోసిన్ తీసుకొచ్చాడు. పద్మకు అనుమానం రావడంతో.. అది కిరోసిన్ కాదని, అది కూడా మద్యమేనని నమ్మించాడు. మరోసారి ఆమెపై అత్యాచారం చేసి.. బండరాయితో తలపై బాదాడు.
అప్పటికీ పద్మ చనిపోకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఆమె మెడలోని ఆభరణాలు, కాళ్ల పట్టీలు సైతం ఎత్తుకెళ్లాడు. ఇటీవలే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.