పని నచ్చకుంటే సాలరీ కట్..! సిబ్బంది పనితీరుపై ప్రక్షాళన
హైదరాబాద్ : మెరుగైన ఫలితాల కోసం ఆరాటపడుతోంది పోలీస్ శాఖ. దీనికోసం కొత్త తరహాలో కార్యాచరణకు సిద్ధమైనట్లు సమాచారం. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నా.. కొన్ని విభాగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వ్యవస్థలో మార్పు రావాలంటే కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని డిసైడయ్యారట.
పనిచేయడం కాదు.. ఫలితాలు రావాలి
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణకు పోలీస్ శాఖ హై టెక్నాలజీ వాడుతోంది. గతంలో కంటే సౌకర్యాలు, సదుపాయాలు పకడ్బందీగా అమలు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారట ఉన్నతాధికారులు. పనిచేయనివారిపై చర్యలు తీసుకుంటే మార్పు రావొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అందులోభాగంగా నోటీసులివ్వడం.. ఆపై వేతనాల్లో కోత విధించడం లాంటి పనిష్మెంట్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
మొదట నోటీసులు.. ఆపై జీతంలో కోత..!
పోలీస్ శాఖ పనితీరు మెరుగు పరచడానికి తొలుత నేర పరిశోధన విభాగం (CID)పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో పనిచేస్తున్న సిబ్బందికి జీతంతో పాటు అడిషనల్ సాలరీ అలవెన్స్ ఉంటుంది. వీరికి పనిభారం ఎక్కువగా ఉండటంతో 25 శాతం మేర అదనంగా వేతనం ఇస్తుంటారు. సీఐడీలో ప్రధానంగా డిప్యూటేషన్ పై వచ్చినవారే ఉంటారు. అయితే ఈ శాఖలో అనుకున్న స్థాయిలో రిజల్స్ట్ రావడం లేదనే భావన నెలకొంది. అంతేకాదు ఏళ్లతరబడి కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. మరోవైపు నమోదవుతున్న కేసుల్లో శిక్షలు పడే శాతం చాలా తక్కువగా ఉంటోందట. అందుకే ఈ డిపార్టుమెంటును మొదట ప్రక్షాళన చేయాలని డిసైట్ అయినట్లు సమాచారం. దర్యాప్తుల్లో పురోగతి , కోర్టుల్లో విచారణ వేగవంతం, శిక్షల శాతం పెంచడం.. ఇలా ప్రతి దర్యాప్తు అధికారి బృందం నిర్దేశించిన టార్గెట్స్ పూర్తి చేయాలి. ఒకవేళ ఆశించిన స్థాయిలో వారు పనిచేయడం లేదనిపిస్తే 2,3 సార్లు నోటీసులిచ్చి.. ఆ తర్వాత కూడా పనితీరు అలానే ఉంటే 25శాతం అదనపు జీతం ఏదైతే ఇస్తున్నారో అది కట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ ప్లాన్ సక్సెసయ్యేనా?
ఖాకీలకు పాఠాలు చెప్పే పోలీస్ అకాడమీలోనూ ఈ కొత్త తరహా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వినికిడి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని బయటకువెళ్లే కానిస్టేబుళ్లు, ఎస్సైలు సరిగా పనిచేయాలంటే ట్రైనర్లదే ప్రధాన పాత్ర ఉంటుంది. అందుకే వారిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శిక్షణ పొందే అభ్యర్థులకు అన్ని రకాలుగా సరైన ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా అనే అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఒకవేళ వారు విఫలమైనట్లు కనిపిస్తే.. 15 శాతం అదనంగా ఇచ్చే వేతనాన్ని ఆపివేయనున్నారట. తొలుత రెండు సార్లు నోటిసులిచ్చాక సాలరీ కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉన్నతాధికారుల నిర్ణయం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.