పొన్నం దీక్షకు నో పర్మిషన్: కెసిఆర్ ఇచ్చిన హామీ సంగతేమిటి?
కరీంనగర్ జిల్లాలోనూ అధికారం చేపట్టిన తొలి ఏడాది 2014 ఆగస్టు ఐదో తేదీన పర్యటించినప్పుడూ కెసిఆర్ హామీల వర్షం కురిపించారు. అందులోనిదే మెడికల్ కళాశాల ఏర్పాటు. కానీ హామీ ఇచ్చి సరిగ్గా మూడేళ్లయింది.
హైదరాబాద్: మాటల తూటలు.. చాతుర్యంతోపాటు సామెతల జోడింపులో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వంటి రాజకీయ నాయకుడికి ఇప్పట్లో సాటి నిలిచే వారు ఉన్నారా? అంటే సందేహమే. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు రకరకాల హామీలతో స్థానికులను ఆకట్టుకోవడం కద్దు.
కరీంనగర్ జిల్లాలోనూ అధికారం చేపట్టిన తొలి ఏడాది 2014 ఆగస్టు ఐదో తేదీన పర్యటించినప్పుడూ ఇదే హామీల వర్షం కురిపించారు. అందులోనిదే మెడికల్ కళాశాల ఏర్పాటు. కానీ హామీ ఇచ్చి సరిగ్గా మూడేళ్లయింది. అతీగతీ లేదు. కానీ గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయి.. విజయదశమి నాడు సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మరి సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి తొలుత ఆయన, ప్రస్తుతం రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రిగా తన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. అంతేకాదు ఆగమేఘాల మీద దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే 2018 - 19 విద్యా సంవత్సరం నుంచి సిద్దిపేట మెడికల్ కాలేజీలో తరగతుల బోధన ప్రారంభమైనట్లే.
ఇతర జిల్లాల సంగతేమిటంటున్న మేధావులు
ఇటువంటి సమయంలోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజలు, ప్రముఖులు, మేధావులు తమ జిల్లాల్లోనూ ఇటువంటి విద్యాసంస్థలు రావాలని కోరుకోవడం సహజమే. అందునా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించి, రాజకీయంగా ఎదిగేందుకు దోహద పడ్డ నగరం కరీంనగర్. 2004లో తొలిసారి.. తెలంగాణ నినాదం వినిపించేందుకు 2006, 2008ల్లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ను విజేతగా నిలిపిందీ కరీంనగరమే. కానీ ఆచరణలో రాజకీయంగా తన ఎదుగుదలకు దోహదపడిన కరీంనగర్ జిల్లా అంటే సీఎం కేసీఆర్ శీతకన్నేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సిరిసిల్ల కాకున్నా కరీంనగర్లో అవకాశాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిగణనలోకి తీసుకుంటే.. సీఎం కేసీఆర్కు రాజకీయ వారసుడిగా పరిగణిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు ఇదే ఉమ్మడి జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అఫ్ కోర్స్ రాజన్న - సిరిసిల్ల జిల్లా ఏర్పాటైనా.. ఆ స్థాయిలో ఇప్పటికిప్పుడు వైద్య కళాశాలలకు అవసరమైన వసతుల కల్పన అంత తేలికేం కాదు.. అయితే పుత్ర వాత్సల్యంతో కూడా చేయాలని భావిస్తే సిరిసిల్లలోనైనా, కరీంనగర్లోనైనా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వాధినేతలోగానీ, అధికార యంత్రాంగంలో గానీ అటువంటి ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదు.
కొలిక్కి రాని పెద్దాసుపత్రి విస్తరణ
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా 2014, ఆగస్టు 5వ తేదీన కరీంనగర్ వచ్చినప్పుడు జిల్లా పెద్దాసుపత్రిని నిమ్స్ స్థాయికి పెంచనున్నట్లు సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రి నేటికీ 350 పడకల ఆసుపత్రిగానే కొనసాగుతోంది. వీరిలో అత్యధికులు పేదలు. వీరికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందాలంటే వెయ్యి పడకల ఆసుపత్రి అవసరం. మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా రూ.20 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు.
వినోద్, కేసీఆర్లకు బహిరంగ చర్చకు ఇలా సవాల్
కానీ ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ సరిగ్గా మూడేళ్ల తర్వాత కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిరవధిక దీక్ష చేపడతానంటే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎలాగైనా దీక్ష చేసి తీరుతానని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కాగా... ఆయన్ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతే కాదు 2004 నుంచి 2009 వరకు, 2014 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్, బోయిన్ పల్లి వినోద్ కుమార్ కూడా కరీంనగర్ లోక్ సభా నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివ్రుద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని కూడా పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కానీ ఈ సవాల్ను స్వీకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
రసమయి రాజకీయంతో అస్తవ్యస్తం
ఇదిలా ఉండగా ఇటీవల కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డిని పొన్నం తదితరులు కలిసి కరీంనగర్ నగరంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు దాటుతున్నా అతీగతీ లేదని ప్రశ్నించడంతో తెలంగాణ రాష్ట్ర సాంస్క్రుతిక సారథి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలకు దిగుతూ వాగ్వాదం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.